iDreamPost
android-app
ios-app

విప్లవ యొధుడు “అష్ఫాఖుల్లాఖాన్”

  • Published Oct 22, 2020 | 3:29 PM Updated Updated Oct 22, 2020 | 3:29 PM
విప్లవ యొధుడు “అష్ఫాఖుల్లాఖాన్”

మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటీష్ వలస పాలకులని దేశం నుండి తరిమికొట్టడానికి అనేక మంది యువకులు విప్లవ పంథాని ఎంచుకున్నారు. అలా విప్లవ బాటలో దేశం కోసం అమరులైన యోధులలో అష్ఫాఖుల్లాఖాన్ ఒకరు. నాటి యునైటెడ్ ప్రావినెన్స్ లోని షాజహాన్ పూర్‌లో 1900 అక్టోబర్ 22న జన్మించిన అష్ఫాఖ్ చిన్నతనం నుంచే దేశంపైన ఎనలేని ప్రేమతో,స్వాతంత్ర్య కాంక్షను ఒంటపట్టించుకున్నారు. చదువుమీద కన్నా బ్రిటీష్ పాలనలో దేశంలో ప్రజలు పడుతున్న కష్టాలు, వారి జీవన పరిస్థితుల మీద ఎక్కువగా అధ్యయనం చేశారు. అలాగే తల్లి మజహారున్నీసా నుంచి సాహిత్యంపై ఇష్టాన్ని పెంచుకుని ఉర్దూ కవిగా పేరు గడించాడు.

అష్ఫాఖ్ 9వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు దేశ నాయకుల పిలుపు మేరకు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేక నిరసనల కార్యక్రమంలో పాల్గొన్నారు.అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై అనేక కవితలు రాస్తూ ప్రజలలో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేశారు ఆ సమయంలోనే విప్లవ పార్టీ “హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ” నాయకులలో ఒకరైన రాం ప్రసాద్ బిస్మిల్‌తో పరిచయం ఏర్పడింది.

బిస్మిల్‌కు ఆర్యసమాజ్ నేపథ్యం ఉండటంతో తొలుత అష్ఫాఖ్ ముస్లిం అవ్వటం చేత ఆయనపై పూర్తి విశ్వాసంతో ఉండేవారు కాదు.అయితే కొన్ని రోజుల ప్రయాణం తర్వాత వారి ఇద్దరి మధ్య స్నేహబంధం బలపడి సహచరులతో రామ్-లక్ష్మణులుగా పిలిపించుకునేవారు. హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ విప్లవ సంస్థ సభ్యుడిగా బిస్మిల్‌ నేతృత్వంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన పలు పోరాటాలలో చురుకుగా పాల్గొన్నారు. శత్రువులను దేశం నుండి తరిమి కొట్టేందుకు ఆయుధాల సమీకరణకి ధనం అవసరం అని గ్రహించిన సంస్థ ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టేందుకు సిద్ధమయింది.తొలుత అష్ఫాఖ్ ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడం లాంటివి చేస్తే అప్పుడే పురుడు పోసుకుంటున్న విప్లవ సంస్థపై బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని,అది సంస్థ మనుగడకే ముప్పు తెస్తుందని హెచ్చరించాడు. కానీ సహచరుల మెజార్టీ నిర్ణయానికి అష్పాఖ్ తలవంచక తప్పలేదు.

విప్లవ సంస్థలలో ఉన్న మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు ప్రభుత్వ ఖజానాను తీసుకొని వెళ్లే రైలు దోపిడీ చేయాలని అష్పాఖ్ పథక రచన  చేశారు. అనుకున్న పథకం ప్రకారం 1925 ఆగస్టు 9న కకోరి అనే గ్రామం దగ్గర ప్రభుత్వ ఖజానాను తీసుకొని వెళ్తున్న రైలుని కొల్లగొట్టారు.ఆ సంఘటనలో అష్ఫాఖ్ ప్రధాన పాత్ర పోషించగా రాం ప్రసాద్ బిస్మిల్ , చంద్రశేఖర్ ఆజాద్, రోషన్ సింగ్, రాజేంద్ర లహరి లాంటి ప్రముఖ విప్లవకారులు పాల్గొన్నారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఖంగుతున్న బ్రిటీష్ ప్రభుత్వం అష్ఫాఖ్ చెప్పినట్టే విప్లవ కారులపై విరుచుకు పడింది.అజ్ఞాతంలోకి వెళ్ళిపొయిన సభ్యులందరిని ప్రత్యేక పోలీసు దళాలతో వెతికించి మరీ అరెస్టు చేసింది. అష్ఫాఖ్ మాత్రం ఏడాది పాటు అజ్ఞాత జీవితం గడిపి స్వగ్రామానికి చెందిన మిత్రుడి ద్రోహం వలన ఢిల్లీలో అరెస్టు అయ్యారు.

Also Read: కకొరి రైలు దోపిడి — 1925 ఆగస్టు 9

సంచలనం రేపిన కకోరి రైలు దోపిడీ కేసు విచారణ ప్రారంభం అయిన తర్వాత మిత్రుడు రాం ప్రసాద్ బిస్మిల్‌ను కాపాడాలనే ఉద్దేశంతో దోపిడికి పూర్తిగా తనదే బాధ్యత అని మిగతా సహచరులకు ఇందులో సంబంధం లేదంటూ న్యాయస్థానానికి లిఖితపూర్వకంగా అష్ఫాఖ్ తెలిపారు. జైలులో హక్కుల కోసం మిత్రులతో కలిసి నిరాహార దీక్షలు చేశారు. చివరికి న్యాయస్థానం అష్ఫాఖ్ తో పాటు రాం ప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లహరి, రోషన్ సింగ్ లను దోపిడికి బాధ్యులని ఉరిశిక్ష విధిస్తూ తీర్పుని ఇచ్చింది. 1927 డిసెంబర్ 19న అష్ఫాఖ్ ను ఫైజాబాద్ జైలులో ఉరితీశారు.

ఉరి సందర్భంగా ఆష్ఫాఖ్ చివరిగా ” నా మాతృభూమి సర్వదా భోగభాగ్యాలతో విలసిల్లాలి,నా హిందుస్థాన్ కు అతి త్వరలోనే స్వేచ్ఛ లభిస్తుంది. బానిసత్వపు సంకెళ్లు త్వరలోనే తెగిపోతాయి” అని ఎంతో ఆత్మవిశ్వాసంతో 27ఏళ్లకే దేశం కోసం ప్రాణాలు అర్పించారు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా విప్లవ యోధుడిని స్మరిస్తూ…