iDreamPost
android-app
ios-app

భూదానోద్యమం – ప్రజలే స్వచ్చందంగా భూమిని ఎందుకు ఇచ్చారో తెలుసా?

  • Published Nov 15, 2020 | 12:16 PM Updated Updated Nov 15, 2020 | 12:16 PM
భూదానోద్యమం – ప్రజలే స్వచ్చందంగా భూమిని ఎందుకు ఇచ్చారో తెలుసా?

భూదానోద్యమ పితామహుడు ఆచార్య వినోభాభావే వర్ధంతి..

మహారాష్ట్రలోని కులవా జిల్లా గాగోడా గ్రామంలో 1895 సెప్టెంబర్ 11వ తేదీన నరహరి, రుక్మిణీ దేవీ దంపతులకు ఆచార్య వినోభాభావే జన్మించారు. చిన్నతనంలో వినోభా తాతగారు శంభూరావు దగ్గరే ఉండేవారు. దీంతో తాతగారి ప్రభావం ఆయనపై పడింది. శంభూరావు వారి ఆధీనంలో ఉన్న శివాలయంలో భజనలకు ముస్లిం మతస్తులని కూడా పిలిచేవారు. దేవాలయాలను హరిజనులకోసం ప్రత్యకంగా తెరిపిస్తూ ఉండేవారు. వీటిని అతి దగ్గరనుండి చూసిన వినోభాకు సమాజ సంస్కరణ బీజాలు చిన్నతనంలోనే మనస్సులో నాటుకుపోయాయి.

1913లో మెట్రిక్యులేషన్ లో ఉత్తీర్ణులయిన భావే మహాత్మా గాంధీ నుంచి స్పూర్తి పొంది భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా పోరాటం చేశారు. భగవద్గీత గ్రంధంపై పట్టుసాదించి సబర్మతీ ఆశ్రమంలో చేరి గాందీజీకి ప్రియశిష్యుడిగా మారారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా పోరాటం చేశారు. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే నెపం మోపి ఆయనను 1932లో మహారాష్ట్రలోని ధూలియా జైలుకు పంపారు. అక్కడ ఆయన తన తోటి ఖైదీలకు ప్రతి ఆదివారం గీతా ప్రవచనం వినిపిస్తూ ఉండేవారు. ఆ గీతా ప్రవచనం “టాక్స్ ఆన్ ది గీత” పేరుతో భారతీయ భాషలన్నింటిలోనే కాక ఇంగ్లీష్, డానిష్, నేపాల్ భాషల్లో ప్రచురించబడి అత్యంత ఆదరణ పొందింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో మరోసారి జైలుకు వెళ్ళి 1945లో విడుదలయ్యారు.

భూదానోధ్యమం

ఆచార్య వినోభాబావే ప్రారంభించిన భూదానోధ్యమం దేశ చరిత్రలో భూసంస్కరణోద్యమానికి నాంది గా నిలిచింది. వినోభాభావే భూదానోద్యమానికి బీజం వేసింది తెలంగాణ ప్రాంతంలోనే. 1951 ఏప్రిల్ 25న తెలంగాణ ప్రాంతంలోని పోచంపల్లి గ్రామంలో ఆచార్య భావే శాంతి పర్యటనకు వచ్చారు. ఈ సంధర్భంలో పోచంపల్లికి సమీపంలోని హరిపురం గ్రామంలోని 40 మంది హరిజన కుటుంభాలు భావేని కలుసుకుని వారి కష్టాలను మొరపెట్టుకున్నారు. కనీసం భూమిలేకుండా బ్రతుకుతున్న వారి భాదలకు చలించిపోయిన వినోభా భూమి ఉన్న వారిని కొంత భూమిని దానం చేయమని చెబుతూ భూదానోద్యమానికి శ్రీకారం చుట్టారు.

దేశం లోని అన్ని ప్రాంతాలను కలుపుతూ మోత్తం 64వేల కిలో మీటర్లు పాదయాత్ర చేసి లక్షల ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో ఎక్కువ భూమి ఇచ్చింది బీహార్ రాష్ట్రం . అంత భూమి బీహార్ నుండి రావడానికి జయప్రకాష్ నారాయణ సహకరించారు. తెలంగాణ ప్రాంతంలో భూస్వామి వెదిరే రామచంద్రారెడ్డి (నల్గొండ) 100 ఎకరాలను భూదానం చేసి ఈ ప్రాంతంలో భూదానోద్యమానికి స్పూర్తిని రగిల్చారు. తెలంగాణ లో చారిత్రాత్మక పాదయాత్ర 51 రోజులు జరిగింది. ఈ సమయంలో 51 గ్రామాలను పర్యటించిన భావే 12,200 ఎకరాలు సేకరించి భూమిలేని నిరుపేదలకు పంచిపెట్టారు. భావే భూస్వాములని బయపెట్టి బెదిరించి భూమిని లాక్కునే ప్రయత్నం చేయలేదు . భూమి పై వారిలో పాతుకుపోయిన మమకారాన్ని వదులుకునేలా ప్రేరేపించారు .

సమాజసేవ, అహింసామార్గం, గోరక్షణ, ఆధ్యాత్మకథోరణి, భూదానోద్యమం, ఇలా ఎన్నో సేవలను అందించిన వినోబా భావే 1982 నవంబర్ 15న ఆనారోగ్య కారణంగా తుదిశ్వాస విడిచారు రాం హరి, రాం హరి , రాం హరి బోల్ – హరి బోల్, హరి బోల్, హరి హరి రాం నినాదాల మధ్య ఆచార్య వినోభాభావే భౌతిక కాయానికి ఆయన పెంపుడు కుమార్తె మహాదేవీతాయి అంత్యక్రియలు నిర్వహించారు. వినోబా మరణాంతరం 1983లో భారతరత్న బిరుదుని బహూకరించారు.