iDreamPost
android-app
ios-app

తొలి స్వదేశీ కలం రత్నం పెన్స్ అధినేత మృతి .

  • Published Sep 21, 2021 | 4:10 AM Updated Updated Sep 21, 2021 | 4:10 AM
తొలి స్వదేశీ కలం రత్నం పెన్స్ అధినేత మృతి .

స్వాతంత్రోద్యమ సందర్భంగా మహాత్మాగాంధీ విదేశీ వస్తు బహిష్కరణ పిలుపు స్పూర్తితో రాజమండ్రిలో రత్నం పెన్స్ అనే సంస్థ స్థాపించిన కె.వి . రత్నం గారి తనయుడు ప్రస్తుత అధినేత కె .రమణమూర్తి నిన్న సోమవారం మరణించారు .

తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన రత్నం పెన్స్ 1932 లోనే స్థాపించగా 1935 లో గాంధీ గారు “మీరు బహుకరించిన స్వదేశీ తయారీ పెన్ను వాడుతున్నాను . చాలా ఆనందంగా ఉంది అని రత్నం పెన్స్ యజమానికి లేఖ రాసిన తర్వాత ఈ సంస్థ గురించి దేశ వ్యాప్తంగా తెలిసింది .

1935 లో మహాత్మా గాంధీ పలు ప్రాంతాలు పర్యటిస్తూ రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆగారు. ఆ సమయంలో రాజమండ్రిలోని రత్నంపెన్నుల సంస్థ యజమాని కోనూరి వెంకట రత్నం బాపూజీని కలిసి తమ సంస్థలో తయారు చేసిన పెన్నును బహూకరిస్తూ “1921లో మిమ్మల్ని కలిసినప్పుడు స్వదేశీ వస్తు తయారీకి కృషి చేయమని మీరు చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి అని గాంధీజీతో వెంకటరత్నం అన్నారు.

గాంధీజీ ఆ పెన్ను నాణ్యత , వ్రాత అనుకూలత చూసి విదేశీ దిగుమతి కావచ్చేమో అని సందేహం వ్యక్తం చేయగా ఆయన సహాయకుడు కుమారప్ప పరిశీలించి ఇది స్వదేశీ తయారీ అని నిర్దారించిన  తర్వాత గాంధీ దాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత “మీరు పంపిన పెన్ను వాడుతున్నాను, ఆనందంగా ఉంది” అంటూ కేవీ రత్నానికి గాంధీజీ స్వయంగా లేఖ రాసిన నాటి నుండి పలువురు స్వాతంత్ర్య ఉద్యమకారులు , స్వదేశీ ఉద్యమ అభిమానులు ఈ పెన్నులు కొని వాడడం మొదలైంది . అప్పటినుండీ రత్నం పెన్ను అంటే స్వదేశీ పెన్నుగా పేరు ప్రఖ్యాతులు గడించింది. ఇప్పటికీ గాంధీజీ రాసిన లేఖ వారి కంపెనీలో చూడొచ్చు .

పెన్నుల తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొంటారు . ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొన్న కొన్ని రకాల నాణ్యమైన రబ్బరు మాత్రమే వినియోగిస్తారు . వెండి, బంగారం పాళీలతో పెన్నులు తయారు చేసివ్వడం వీరి ప్రత్యేకత . బంగారానికున్న సున్నితత్వం కారణంగా 24 క్యారెట్ రోజువారీ వాడకానికి అనువుకాదని 14 క్యారెట్ల బంగారంతో చేసిన పాళీలతో కూడా పెన్నులు సిద్ధం చేస్తున్నారు. అప్పట్లో గాంధీకి అందించిన పెన్ను కూడా 14 క్యారెట్ల బంగారం పాళీతో చేసిందే.

పాళీ తయారీలో 24 క్యారెట్ బంగారం కన్నా 14 క్యారెట్ల బంగారమే సౌకర్యవంతంగా ఉంటుందని, అందుకే ఎక్కువ మంది 14 క్యారెట్ల బంగారంతో తయారయిన వాటికే ప్రాధాన్యమిస్తారు.

వీరు తయారు చేసిన 1.5 గ్రాముల బరువుండే అతి చిన్న పెన్, అతి చిన్న బంగారం పెన్నులు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.

రత్నం కంపెనీ పెన్నుల్లో చాలా రకాలున్నాయి. 300 రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల ఖరీదు చేసే బాల్ , ఇంక్ పెన్నులను వీరు తయారు చేస్తున్నారు. Supreme అనే మోడల్ కేవలం రాష్ట్రపతి, ప్రధాన మంత్రి , విదేశీ ప్రముఖుల వంటి వారి కోసం తయారుచేస్తున్నారు.

రత్నం పెన్నులతో రాయడం మొదలెడితే వేరే పెన్నులు వాడాలనిపించదంటారు. దేశంలోని పలు ప్రాంతాల నుండి రత్నం పెన్స్ కోసం వచ్చి ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకొంటారు . రాజమండ్రిలోని ఓ చిన్న సందులో ఉన్న పెన్నుల కంపెనీకి దూరప్రాంతాల వారు వచ్చి కొనుక్కుపోవడం కొత్త వారికి ఆశ్చర్యమేమో కానీ అక్కడి వారికి మామూలు విషయమై పోయింది .

కె వి రత్నం గారి తర్వాత వారి కుమారుడు రమణ మూర్తి రత్నం పెన్స్ సంస్థ బాధ్యతలు తీసుకున్నారు . తరం మారినా రత్నం పెన్నుల ప్రత్యేక వ్రాత మారలేదు . నాటి దేశ భక్తుల నుండి నుండి నేటి రాజకీయ నాయకుల వరకూ పలు కీలక సంతకాలు , రచనలకు జాలువారిన అక్షరాలు రత్నం పెన్నులవే .

భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నుంచి ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ వరకూ ప్రమాణ స్వీకార సందర్భంగా రత్నం కంపెనీ పెన్నులతోనే సంతకాలు చేశారట , అలాగే నెహ్రూ నుంచి మోదీ వరకూ ప్రధాన మంత్రులందరూ తమ రత్నం పెన్నులను వాడారని కంపెనీ వారు గర్వంగా చెబుతారు . వారికోసమే ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి మోడల్స్ తయారు చేసి అందించారట . జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా కేవీ రత్నం పెన్స్ తయారీ కేంద్రాన్ని సందర్శించారని , అప్పట్లో నెహ్రూ వాడిన రత్నం పెన్ నేటికీ అలహాబాద్లోని ఆయన స్వగృహంలో దాచి ఉంచినట్టు, పలువురు విదేశీ అధ్యక్షుల కోసం సైతం రత్నం పెన్నులు అందించామని కొద్ది కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో రమణమూర్తి చెప్పారు .

మీలో ఎవరు కోటీశ్వరుడు లో ఒకసారి 25 లక్షల ప్రశ్న కింద “మన దేశంలో మొట్ట మొదటి స్వదేశీ పెన్ను ఎక్కడ తయారయ్యింది” అనే ప్రశ్న అడగడం విశేషం …

అలాంటి ఘనతలు సొంతం చేసుకున్న రాజమండ్రి రత్నం పెన్స్ వ్యవస్థాపకుడు కె.వి రత్నం కుమారుడు రమణమూర్తి(80) నిన్న మరణించడంతో రత్నం పెన్స్ సంస్థ మరో తరాన్ని కోల్పోయింది, వారికి నివాళి