iDreamPost
android-app
ios-app

దిశ అత్యాచారం-ఢిల్లీ మహిళా కమీషన్ అధ్యక్షురాలు నిరవధిక నిరాహారదీక్ష

దిశ అత్యాచారం-ఢిల్లీ మహిళా కమీషన్ అధ్యక్షురాలు నిరవధిక నిరాహారదీక్ష

దిశ హత్యాచార ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. లైంగిక వేధింపులు, అత్యాచార నేరాల్లో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్షలు విధించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో అత్యాచార ఘటనలు పెరిగిపోవడాన్ని నిరసిస్తూ ఢిల్లీ మహిళా కమీషన్ అధ్యక్షురాలు, స్వాతి మాలివాల్ జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. దిశ హత్యాచార నేపథ్యంలో స్వాతి మాలివాల్ నిరసనకు దిగారు. ఆమెకు మద్దతుగా మరికొందరు మహిళలు దీక్షా శిబిరానికి చేరుకున్నారు.నిరసనలో భాగంగా లైంగిక నేరాల్లో దోషులకు వీలైనంత త్వరలో కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.అత్యాచార నేరాల్లో దోషులుగా తేలిన వారికి ఆరు నెలల్లో ఉరి శిక్షను అమలు చేయాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు స్వాతి మాలివాల్ తెలిపారు.

కాగా దిశను బ్రతికుండగానే తగలబెట్టామనే నిందితుడి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అత్యాచార ఘటనతో పూర్తి అపస్మారక స్థితికి చేరిపోయిన దిశను బ్రతికుండగానే కాల్చివేసామని కీలక నిందితుడు అరిఫ్ కిందిస్థాయి సిబ్బందికి వెల్లడించాడని తెలుస్తుంది. దిశ హత్యకేసులో నిందితులుగా ఉన్న నలుగురిని చర్లపల్లి జైల్ కి తరలించారు. వారిపై తోటి ఖైదీలు దాడిచేసే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రతను వారికి ఏర్పాటు చేసి వారి గది నుండి బయటకు రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

లైంగిక నేరాల్లో చట్టాలను కఠినతరం చేయాలని దోషులుగా తేలితే ఉరి తీయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు మిన్నంటుతున్నాయి.చట్టాల్లో మార్పును తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విచారణలో జాప్యం లేకుండా త్వరితగతిన శిక్షలు అమలు చేయాలని దానికి అనుగుణంగా చట్టాలను మార్చాలని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.