iDreamPost
iDreamPost
డామిట్.. కథ అడ్డం తిరిగిందే.. ఏదో జరుగుతుందనుకుంటే ఇలా అయిందేమిటి?.. అంటూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, దానికి వంత పాడే ఎల్లో మీడియా తెగ అసంతృప్తితో రగిలిపోతున్నాయి. వివాదం ముదిరి సమ్మె వరకు దారితీస్తుందన్న ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి తనదైన స్టైల్ లో ముగించడం టీడీపీ, ఎల్లో మీడియాకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు
పీఆర్సీతో పాటు ఉద్యోగులు కోరని, అసలు ఊహించని మరికొన్ని వరాలు ప్రకటించి వారిని ఫిదా చేసిన సీఎం.. అదే సమయంలో ప్రతిపక్షం నోట మాట పెగలకుండా చేసేలా దెబ్బకొట్టారు. పీఆర్సీని అడ్డం పెట్టుకుని ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసిన టీడీపీ తాజా పరిణామాలతో బిక్కచచ్చిపోయింది.
ఊహించని ముగింపు
పీఆర్సీ కోసం ఉద్యోగులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం దాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ.. చివరికి అమలు చేయకుండానే అధికారం నుంచి దిగిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం తక్షణ ఉపశమనంగా 27 శాతం ఇంటీరియం రిలీఫ్ (ఐఆర్) ప్రకటించి ఉద్యోగుల పట్ల తన నిబద్ధతను చాటుకుంది. కానీ గత రెండేళ్లుగా కోవిడ్ సంక్షోభంతో ఆదాయం తగ్గిపోవడంతో పీఆర్సీ ప్రకటనలో జాప్యం జరిగింది. చివరికి ఇటీవల దాని అమలు ప్రక్రియ చేపట్టింది. పీఆర్సీ నివేదికను పరిశీలించిన ఐఏఎస్ అధికారుల కమిటీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సిఫార్సు చేసింది.
దానికి ఉద్యోగ సంఘాలు అంగీకరించక పోవడంతో పలుమార్లు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉద్యోగులు గతంలో వాయిదా వేసిన ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో సీఎం జగన్ జోక్యం చేసుకుని యూనియన్ నేతలతో స్వయంగా చర్చించారు. వారు చెప్పినవి నోట్ చేసుకుని.. గరిష్ట ప్రయోజనం కల్పించేలా నిర్ణయం తీసుకుంటానని, ఉద్యోగులు కూడా రాష్ట్ర పరిస్థితిని గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానన్న సీఎం.. ఒక్క రోజుల్లోనే మళ్లీ ఉద్యోగ నేతలతో చర్చలు జరిపి వారి సమక్షంలోనే తుది నిర్ణయం ప్రకటించారు.
Also Read : పీఆర్సీని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ .. సంక్రాంతి ముందే ఉద్యోగులకు వరాలు
ప్రస్తుతం ఇస్తున్న 27 శాతం ఐఆర్ కంటే కాస్త తక్కువగా 23.29 శాతం ఫిట్మెంట్ ఖరారు చేసినా.. ఏడు వాయిదాల పెండింగ్ డీఏలను జనవరి నెల వేతనాలతోనే ఇస్తామని, పెరిగిన వేతనాలు కూడా జనవరి నుంచే ఇస్తామని సీఎం ప్రకటించడం ఉద్యోగులను సంతృప్తి పరిచింది. అలాగే ఉద్యోగులు కోరుతున్న సీపీఎస్ రద్దు అంశాన్ని జూన్ 30లోగా పరిష్కరిస్తామని, కోవిడ్ వల్ల మరణించిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు జూన్ 30లోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వీటితోపాటు ఉద్యోగులు ఏమాత్రం ఊహించని రీతిలో ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం, సొంత ఇళ్లు లేని ఉద్యోగులకు జగనన్న స్మార్ట్ టౌన్స్ పథకంలో 10 శాతం ప్లాట్లు రిజర్వ్ చేయడంతో పాటు ధరలో 20 శాతం రాయితీ ఇస్తామని సీఎం చేసిన ప్రకటన ఉద్యోగవర్గాలను అమితానందభరితులను చేశాయి.
ప్రతిపక్షం ఆశలు గల్లంతు
పీఆర్సీ వ్యవహారాన్ని సీఎం జగన్ ముగించిన తీరు ప్రతిపక్ష టీడీపీని అవాక్కయ్యేలా చేసింది. ఈ వివాదాన్ని మరింత ముదరబెట్టి, ఉద్యోగులను ప్రభుత్వంపైకి ఉసిగొల్పి రాజకీయ లబ్ది పొందాలని టీడీపీ ఆశ పడింది. కానీ సీఎం జగన్, ఉద్యోగులు ఆ పార్టీ ఆశలపై నీళ్లు చల్లారు. వాస్తవానికి తమ ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన పీఆర్సీని ఎగ్గొట్టిన టీడీపీ.. జగన్ ప్రభుత్వం ఆ ప్రక్రియ చేపట్టినప్పటి నుంచే ఉద్యోగులను రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. ఐఏఎస్ ల కమిటీ 14.29 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేయడం.. దానికి అంగీకరించని ఉద్యోగులతో పలుమార్లు జరిగిన చర్చలు ఫలించకపోవడం, ఉద్యోగులు దశలవారీ ఆందోళనలు చేపట్టడం టీడీపీలో ఆశలు రేపాయి.
అయితే ప్రభుత్వ విజ్ఞప్తితో ఉద్యోగులు ఉద్యమం విరమించడం ఆ పార్టీకి మింగుడు పడలేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు బహిరంగంగానే ఉద్యోగ నేతలపై అసంతృప్తి వెళ్లగక్కారు. ఉద్యోగులను ఏదో విధంగా ఉసిగొల్పి వారిని సమ్మె దిశగా ఎగదోయాలని చూశారు. ప్రభుత్వం ఉద్యోగులు కోరినంత ఫిట్మెంట్ ఇవ్వలేదని, వారు సమ్మె చేయడం ఖాయమని, దాన్ని ఉపయోగించుకుని ఉద్యోగులను తమ వైపు తిప్పుకోవచ్చని టీడీపీ దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకుంది. ఆ దిశగానే తన అనుకూల ఎల్లో మీడియాలో వార్తా కథనాలు వండి వార్చేలా చేసింది. కానీ చివరకు సీఎం జగన్ ఉద్యోగుల విషయంలో తన నిబద్ధతను మరోసారి చాటుకుని.. పీఆర్సీ వ్యవహారానికి అనూహ్య ముగింపునిచ్చి టీడీపీకి ఆశలపై నీళ్లు చల్లారు.
Also Read : పీఆర్సీపై ఉద్యోగులకు స్పష్టత ఇచ్చిన జగన్.. భేటీలో ఏం చెప్పారంటే..?