Idream media
Idream media
ప్రచార వ్యూహకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అపరచాణక్యుడు.. రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ నిబంధనలను ఔపోసన పట్టిన రాజకీయ దురంధరుడు.. ఇక సెలవంటూ దివికేగారు. భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. సైనిక లాంఛనాలతో లోధిరోడ్డులోని శ్మశానవాటికలో కుటుంబ సంప్రదాయప్రకారం ఈ అంత్యక్రియలు జరిగాయి. ప్రణబ్ పార్థివ దేహంపై సైనికులు జాతీయపతాకం ఉంచారు. కొవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరిమిత సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకు ముందు ఢిల్లీ 10 రాజాజీ మార్గ్ లోని ప్రణబ్ నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితర ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించేందుకు ప్రణబ్ నివాసానికి చేరుకున్నారు.
సంతాపదినాలు
అనారోగ్య సమస్యలతో ఆగస్టు 10న ఢిల్లీలోని ఆర్మీ ఆస్ప్రతిలో ప్రణబ్ చేరిన విషయం విదితమే. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆయనకు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు సర్జరీ చేశారు. ఆ తర్వాత ప్రణబ్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 31న సాయంత్రం ప్రణబ్ తుదిశ్వాస విడిచారు. దేశానికి ఆయన అందించిన సేవలకు నివాళిగా కేంద్రం ఏడు రోజులు (ఆగస్టు 31-సెప్టెంబరు 6) సంతాపదినాలుగా ప్రకటించింది. ఈ ఏడు రోజుల్లో అధికారికంగా ఎలాంటి వినోద కార్యక్రమాలూ ఉండబోవని తెలిపింది.