iDreamPost
android-app
ios-app

ఏపీలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, తొలిసారిగా దాటిన రూ. 3వేల కోట్ల మార్క్

  • Published Mar 01, 2022 | 6:46 PM Updated Updated Mar 01, 2022 | 6:57 PM
ఏపీలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు,  తొలిసారిగా దాటిన రూ. 3వేల కోట్ల మార్క్

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విపక్షాలు విమర్శించని రోజు లేదు. పప్పు బెల్లాలంటూ పేదలకు అందిస్తున్న సహాయాన్ని ఎద్దేవాచేయని సందర్భంలేదు. విపక్షాలతో పాటుగా కొందరు సోకాల్డ్ మేథావులమనుకునే వారు కూడా పేదలకు అందించే సంక్షేమ పథకాలను తప్పుబడుతూ వస్తున్నారు. కానీ జాతీయ,అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల సూచనలకు అనుగుణంగా జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోంది. ప్రజల కొనుగోలుశక్తిలో పురోగతి కనిపిస్తోంది. ఏపీలో మార్కెట్ పుంజుకోగలుగుతోంది. కరోనా అనంతరం అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో పన్నుల వసూళ్లు పెరుగుతుండడం దానికి కొలబద్ధగా కనిపిస్తోంది.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు 2019 ఫిబ్రవరిలో ఏపీలో జీఎస్టీ వసూళ్లు రూ.2088 కోట్లుగా ఉంది. చంద్రబాబు హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలకు బదులుగా ఆడంబరాలు, అమరావతి చుట్టూ హడావిడికే ప్రాధాన్యతనివ్వడంతో ఏపీలో పన్నుల వసూళ్లు అంతంతమాత్రంగా ఉండేది. అదే సమయంలో తెలంగాణాలో రూ.3460 కోట్ల మేర జీఎస్టీ వసూలయ్యింది. ఇక కరోనా లాక్ డౌన్ కి సరిగ్గా ఒక నెలముందు అంటే 2020 ఫిబ్రవరి నాటికి ఏపీలో అది 23శాతం పెరుగుదలతో రూ.2563 కోట్లకు చేరింది. అదే సమయంలో తెలంగాణాలో పెరుగుదల కేవలం 6 శాతమే ఉంది. అంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే కరోనాకి ముందు ఏపీలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన తీరుని ఇది చాటుతోంది.

గత ఏడాది ఫిబ్రవరిలో ఏపీలో జీఎస్టీ వసూళ్లు రూ.2633 కోట్లుగా ఉంటే ఈ ఏడాది గత నెలలో అది తొలిసారిగా 3వేల కోట్ల రూపాయల మార్క్ ని దాటింది. రూ.3157 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే 19శాతం పెరుగుదల కనిపించింది. కరోనా విపత్తులో కూడా సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాథాన్యతనివ్వడం ఎలాంటి ఫలితాన్నిస్తుందో ఇది చాటుతోంది. తెలంగాణాలో కేవలం 6శాతం పెరుగుదల ఉంటే ఏపీలో మూడింతలు అదనంగా మార్కెట్ నుంచి జీఎస్టీ వసూళ్లు ఉండడం విశేషంగా భావించాలి. ఇక అనేక రాష్ట్రాలతో పోల్చినా ఏపీ వేగంగా పుంజుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

జాతీయ స్థాయిలో కూడా ఫిబ్రవరిలో రూ.1.30 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు జరిగాయి. ఒక్క నెలలో ఇంత పెద్ద మొత్తంలో జీఎస్టీ వసూళ్లు ఈ మార్క్ కి చేరడం ఐదోసారి మాత్రమే. 18శాతం దేశ వ్యాప్తంగా ఈ పెరుగుదల ఉందని కేంద్రం ప్రకటించింది. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాల కారణంగా ఏపీలో జీఎస్టీ వసూళ్లు పెరగడం రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజల కొనుగోలు శక్తిని నిలబెట్టడం ద్వారా రాష్ట్రంలో వాణిజ్య, వ్యాపార వ్యవహారాలు పుంజుకోవడంలో ప్రభుత్వం పాత్ర అభినందనీయమనే మాట వినిపిస్తోంది.