iDreamPost
android-app
ios-app

Ganja-గంజాయిపై ఏపీ యుద్ధం.. ఆపరేషన్ పరివర్తన్

  • Published Nov 04, 2021 | 6:48 AM Updated Updated Mar 11, 2022 | 10:36 PM
Ganja-గంజాయిపై ఏపీ యుద్ధం.. ఆపరేషన్ పరివర్తన్

గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో మూడు నెలల్లో రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు కంకణం కట్టుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీస్, ఎక్సయిజ్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించాయి. దీనికి ముందు ఇరుగుపొరుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో ఏపీ అధికారులు చర్చలు జరిపి వారి సహకారం కోరారు. రాష్ట్రం గంజాయి అడ్డాగా మారిందని కొద్దిరోజులుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో విశాఖ మాన్యప్రాంతం గంజాయి సాగుకు కేంద్రంగా ఉంది. తెలుగుదేశం హయాంలో ఆ పార్టీ నేతలే గంజాయి అక్రమ రవాణాకు పాల్పడేవారన్న ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. అయితే రాజకీయంగా ఆరోపణలు రావడంతో సీఎం జగన్ ఇటీవల ఉన్నతాధికారులతో దీనిపై సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణాను ఉక్కుపాదంతో అణిచివేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. దాంతో అధికారులు రంగంలోకి దిగారు.

దశాబ్దాలుగా ఏవోబీలో సాగు

గంజాయి సాగు, రవాణా ఇప్పటివి కావు. కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యకలాపాలకు విశాఖ మన్యం పరిధిలోని ఆంధ్ర ఒడిశా బోర్డర్ (ఏవోబీ) ప్రాంతాలు అడ్డాగా మారాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతాల్లో వారి ప్రోత్సాహంతోనే చాలా ఏళ్లుగా గంజాయి సాగు జరుగుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. గిరిజనులు సాగుచేసిన గంజాయిని తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లు అక్కడి నుంచి దొంగ దారుల్లో దేశంలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పలువురు ఆ పార్టీ నాయకులు కూడా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడేవారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ఎస్ఈబీ బృందాలు దాడులు పెంచి.. గంజాయి స్వాధీనం, అరెస్టులు వంటి చర్యలు తీవ్రతరం చేయడంతో ఎన్నడూ లేనంత అధిక పరిమాణంలో గంజాయి పట్టుబడింది. అయితే ముంద్రా పోర్టులో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడిన ఉదంతంతో ఏపీకి సంబంధం లేకపోయినా టీడీపీ, జనసేన నేతలు దాంతో రాష్ట్రానికి లింకు పెట్టి గంజాయి అడ్డాగా మారిందని ఆరోపణలు చేశారు. వీటికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ కు శ్రీకారం చుట్టింది.

800 మంది సిబ్బంది.. 10 బృందాలు

సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మొదట ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, చత్తీస్గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి చర్చలు జరిపారు. ఆపరేషన్ పరివర్తన్ కు వారి సహకారం కోరారు. అనంతరం ఏవోబీలో కార్యాచరణ ప్రారంభించారు. పోలీస్, ఎక్సయిజ్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు చెందిన 800 మంది సిబ్బందిని 10 బృందాలుగా ఏర్పాటు చేసి రంగంలోకి దించారు. ఈ బృందాలు నాలుగు రోజులుగా విశాఖ మన్యంలోని ఏవోబీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలు, జీపీఎస్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు జరుగుతున్న ప్రాంతాలను మొదట గుర్తిస్తున్నారు. ఆ ప్రాంతాలకు బృందాలను పంపి గంజాయి పంటలను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికి జి.మాడుగుల, జీకే వీధి మండలాల్లో సుమారు 270 ఎకరాల గంజాయి పంటలను ధ్వంసం చేశారు. ఈ రెండు మండలాల్లో సుమారు 400 ఎకరాల్లో హైబ్రిడ్ గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు.

అడ్డుకుంటున్న గిరిజనులు

గంజాయి సాగు ద్వారా సంపాదనకు అలవాటు పడిన గిరిజనులు పలు చోట్ల దాడులను అడ్డుకుంటున్నారు. అయితే అధికారులు వారితో చర్చలు జరిపి నచ్చజెపుతూ ముందుకు సాగుతున్నారు. బుధవారం జి.మాడుగుల మండలం బోయితిలి గ్రామ పరిసరాల్లో గంజాయి పంట ధ్వంసానికి వెళ్లిన బృందాలను అక్కడి గిరిజనులు అడ్డుకున్నారు. ఇదే తమకు ఆధారమని, బంగారం తాకట్టు పెట్టి పెట్టుబడి పెట్టామని, ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తే.. వచ్చే ఏడాది సాగు ఆపేస్తామని వేడుకున్నారు. అయితే అధికారులు వెనక్కి తగ్గలేదు. ఒక బృందం గిరిజనులతో చర్చలు జరుపుతుండగా.. మరో బృందం సాగులో ఉన్న పంటను ధ్వంసం చేసింది. ఆపరేషన్ పరివర్తన్ ద్వారా మూడు నెలల్లో రాష్ట్రాన్ని గంజాయి లేకుండా చేయాలన్న లక్ష్యంతో అధికారులు దాని ములాలపై దెబ్బకొడుతున్నారు.