ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు’ నినాదానికి కొనసాగింపుగా మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఒకే దేశం- ఒకే రేషన్ కార్డును వినియోగంలోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, శ్రామికవర్గం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ‘వన్ నేషన్.. వన్ పే డే’ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ వెల్లడించారు.
సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ మాట్లాడుతూ, దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికి, ఒకేరోజు వేతనం అందేలా, ప్రధాని మోడీ చట్టాన్ని తీసుకురాబోతున్నారని వెల్లడించారు. దీనితో పాటు, కార్మికులందరికి మెరుగైన జీవితం దక్కేలా, అన్ని రంగాల్లో కనీస వేతనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక కార్మిక సంస్కరణలను చేపట్టిందని గాంగ్వర్ తెలిపారు. 44 కార్మిక చట్టాలను సంస్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. త్వరలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ రూ.3వేల పెన్షన్తో పాటు వైద్య బీమా అందించేందుకు మోదీ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న వాటిలో ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ పెద్దదని, సుమారు 90 లక్షల మందికి ఇందులో ఉపాధి పొందుతున్నారని, భవిష్యత్ లో ఈ సంఖ్య 2 కోట్లమందికి చేరే అవకాశం ఉందని తెలిపారు