iDreamPost
iDreamPost
టెస్ట్ క్రికెట్ అంటే బోర్ అనుకుంటాం…కానీ అప్పుడప్పుడూ కొన్ని మ్యాచ్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠత రేకెత్తిస్తాయి.అచ్చు ఇండియా… న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లా.
2.. 1.. 2.. 5.. 4…న్యూజిలాండ్ చివరి బ్యాట్స్మెన్లు సాధించిన స్కోర్. ఇక మిగిలింది ఒక్క వికెట్ మాత్రమే. ఏదో అద్భుతం జరిగితే తప్ప న్యూజిలాండ్ జట్టు భారత్ విజయాన్ని అడ్డుకోలేదని అభిమానులు ఆశించారు.కానీ అద్భుతమే జరిగింది. మ్యాచ్ డ్రా గా ముగిసింది.
91 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులు మాత్రమే చేస్తే సగటు క్రికెట్ అభిమానికి విసుగు పడుతుంది. కానీ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర ఇంత జిడ్డుగా ఆడుతుంటే మాత్రం న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు అతని ఆటకు ఫిదా అయి ఉంటారు. భారత్ విజయాన్ని తన ఆటతో రవీంద్ర విజయవంతంగా అడ్డుకున్నాడు. ఓటమిబారిన పడిన తన జట్టును ఒడ్డున పడేశాడు.
కాన్పూర్ వేదికగా భారత్,న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ చివరి రోజు చివరి మూడు గంటలు ఉత్కంఠతకు గురి చేసింది. వెంట్రుక వాసిలో భారత్ విజయం చేజారింది. చివరిలో రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్లు భారత విజయాన్ని అడ్డుకున్నారు. నాల్గవ రోజు న్యూజిలాండ్ జట్టు 4 ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. ఐదవ రోజు సోమవారం 94 ఓవర్లలో 280 పరుగులు చేయాల్సి ఉంది.చేతిలో తొమ్మిది వికెట్లు మాత్రమే ఉన్నాయి.చివరి రోజు తొలి సెషన్లో న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయించింది.లంచ్ బ్రేక్ కి న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి 82 పరుగులు సాధించి విజయంపై ధీమాగా ఉంది. రెండో సెషన్లో తొలి బంతికే ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ సోమర్విలేను ఔట్ చేసి కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు.ఆ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేస్తుండడంతో లేథమ్తో కలిసి కేన్ విలియమ్సన్ (112 బంతుల్లో 24 రన్స్)ఆచితూచి ఆడుతూ మ్యాచ్ డ్రా చేసేందుకు ప్రయత్నించారు.
ఆఖరి సెషన్లో ఊహించని రీతిలో పుంజుకున్న భారత బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి గెలుపుపై ఆశలు రేకెత్తించారు.న్యూజిలాండ్ వికెట్లు టపటపా రాలిపోయాయి.కివీస్ జట్టులో టామ్ లీథమ్ ఒక్కరే 52 స్కోర్ చేశారు. కెప్టెన్ విలియమ్స్న్ 24తో సహా అందరూ విఫలమయ్యారు. న్యూజిలాండ్ స్కోర్ 155 వద్ద ఉండగా 89.2 ఓవర్లో ఆ జట్టు తొమ్మిదవ వికెట్ను కోల్పోయింది.అప్పటికి ఇంకా 8.4 ఓవర్లున్నాయి. భారత్ జట్టు గెలుపు ఇక లాంఛనమే అనుకున్నారు. అయితే రచిన్ రవీంద్ర 91 బంతులు ఆడి కేవలం 18 పరుగులు మాత్రమే చేసి భారత్ విజయానికి అడ్డుగా నిలిచాడు. ఇతనికి చివరి బ్యాట్స్మెన్ అజాజ్ పటేల్ (23 బంతుల్లో 2 పరుగులు) తోడయ్యాడు. చివరి వికెట్ కోసం భారత బౌలర్లు చెమటోడ్చినా ఫలితం దక్కలేదు.
కాన్పూర్ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 296 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 49 పరుగులు ఆధిక్యం వచ్చింది. రెండవ ఇన్నింగ్స్లో భారత జట్టు ఒక సమయంలో 51 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాలలో పడింది. శ్రేయస్ అయ్యర్ (65), వృద్ధిమాన్ సాహా (61) ఆదుకోవడంతో భారత జట్టు 234 పరుగులు చేసింది. న్యూజిలాండ్ విజయలక్ష్యం 284. పెద్ద లక్ష్యం కాకున్నా… ఓటమి అంచుల వరకు వెళ్లిన్యూజిలాండ్ జట్టు గట్టెక్కింది. ఫలితం డ్రా కావడంతో భారతీయ అభిమానులను నిరాశపరిచింది.