iDreamPost
android-app
ios-app

మూడు పోర్టులు, డజను రహదారులు

  • Published Aug 14, 2021 | 5:41 AM Updated Updated Aug 14, 2021 | 5:41 AM
మూడు పోర్టులు, డజను రహదారులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అభివృద్ధికి కొత్త అవకాశాలు వెదికే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగా కార్గో రవాణా కోసం కొత్త మార్గాలు సిద్ధమవుతున్నాయి. మూడు పార్టీలకు అనుసంధానంగా మరో 13 రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అవి అందుబాటులోకి వస్తే ఒడిశా, చత్తీస్ ఘడ్, కర్ణాటకా రాష్ట్రాలకు కూడా ఏపీ నుంచి కార్గో రవాణా మరింత విస్తృతం కాబోతోంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు, పనులు కూడా మొదలు కావడం శుభసూచికంగా కనిపిస్తోంది.

ఏపీలో మూడు కీలక పోర్టులుగా ఉన్న విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేసే పనులు వేగవంతం అవుతున్నాయి. దానికోసం సుమారు 8వేల కోట్లు వెచ్చించబోతున్నారు. 277 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించబోతున్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి అచ్చంపేట జంక్షన్ వరకూ 13 కిలోమీటర్ల రోడ్డు వేయడం ద్వారా ఎన్ హెచ్ 216కి కనెక్ట్ చేయబోతున్నారు. విశాఖ లోని ఔటర్ హార్బర్ నుంచి పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు జంక్షన్ కి కలిపేందుకు కొత్త రోడ్డు అందుబాటులోకి తెస్తున్నారు. 4 కిలోమీటర్ల పొడవునా, 4 లేన్లతో నిర్మించే ఈరోడ్డుని ఎన్ హెచ్ 16కి కనెక్ట్ చేయడం ద్వారా రవాణా సులువుగా మారుతుంది.

కృష్ణపట్నం పోర్టు సమీపంలోని తమ్మనపట్నం నుంచి మల్లూరు వరకూ 17 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరగోబోతంది. దీనిద్వారా డెడికేటెడ్ పోర్టు రోడ్డుని కలపడంతో కార్గో రవాణాకి తోడ్పడుతుంది. కాకినాడ పోర్టు నుంచి ఉప్పాడ బీచ్ రోడ్డు మీదుగా ఎన్ హెచ్ 16ని కలిపేందుకు రోడ్డు, నెల్లూరు జిల్లా చిలకూరు క్రాస్ నుంచి కడపూరు వరకూ మరో రోడ్డుకి కూడా డీపీఆర్ పూర్తయ్యింది. వీటితో పాటుగా మరో 7 రోడ్లకు డీపీఆర్ సిద్ధమవుతోంది.

ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఏపీని లాజిస్టిక్స్, కార్గో హబ్ గా మార్చాలనే యత్నాలు విజయవంతం అవుతాయి. మూడు పోర్టుల ద్వారా జరిగే దిగుబడులు ఆయా ప్రాంతాలకు రవాణా చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. పోర్టులకు రద్దీ పెరగడమే కాకుండా, సరుకు రవాణా ద్వారా ఏపీకి మరింత మెరుగైన అవకాశాలుంటాయనే అభిప్రాయం వినిపిస్తోంది.

Also Read : ఎస్సీ, ఎస్టీల‌కు వేర్వేరు క‌మిష‌న్ లు : జ‌గ‌న్ పాల‌న‌లో మ‌రో మైలు రాయి