iDreamPost
iDreamPost
అనంతపురం జిల్లాలో తాగు, సాగు నీటి కష్టాలను తీర్చేందుకు పలు ప్రతిపాదనలున్నప్పటికీ అవి ఆచరణ రూపం దాల్చకపోవడమే అసలు సమస్యగా ఉంటోంది. గడిచిన రెండేళ్లుగా వర్షాలు అధిక వర్షపాతం నమోదుకావడం వల్ల అసలు సమస్య కనిపించలేదు. అయినప్పటికీ దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బ్రహ్మం సాగర్ వంటి సమస్యలను పరిష్కరించి నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు మార్గం సుగమం చేసింది. అదే రీతిలో గండికోట విషయంలోనూ చొరవ చూపించడంతో రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి అవకాశం దక్కుతోంది. ఈ నేపథ్యంలో గండికోట రిజర్వాయర్ నీటిని తరలించి అనంతపురం జిల్లా పుట్లూరు మండల వాసులను కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నానికి ప్రభుత్వం అడుగులు వేసింది.
గండికోట జలాశయం నీటిని పుట్లూరుకు తరలించేందుకు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడుతోంది. దానికి అనుగుణంగా పరిశీలనచేసి, డిజైన్లతో కూడా డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారీకి నిధులు కేటాయించింది. 0.5 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా పుట్లూరు వాసుల తాగునీటి సమస్యతో పాటుగా 11,500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఉంటుందని ఇప్పటికే ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వాటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం దానికి అనుగుణంగా రూ. 77లక్షల నిధులను తొలిదశలో కేటాయించింది.
ప్రస్తుతం చెరువులు, బోర్లు మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇది అవకాశంగా మారబోతోంది. నేరుగా గండికోట నీటిని పుట్లూరు ప్రాంతానికి తరలించేందుకు ఈ లిఫ్ట్ స్కీమ్ అందుబాటులోకి వస్తే శింగనమల నియోజకవర్గ రైతులకు పెద్ద ఊరటగా ఉంటుంది. సుదీర్ఘకాలంగా ఇలాంటి ప్రతిపాదనల విషయంలో ప్రభుత్వాలు సాచివేత ధోరణి అవలంభించాయి. కానీ కోవిడ్ పరిస్థితల నుంచి కోలుకుంటున్న తరుణంలో అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే ధోరణిలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా పుట్లూరు లిఫ్ట్ స్టేజ్ వన్ కి శ్రీకారం చుడుతోంది. సుమారుగా రూ. 13.09 కోట్ల నిధులతో ఈ స్కీమ్ చేపట్టబోతున్నారు. అందుకు డీపీఆర్ సిద్ధమయిన తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
Also Read : అసలైన సాగుదారులకు దన్నుగా..