iDreamPost
iDreamPost
1989లో విడుదలైన ‘అంకుశం’ దెబ్బకు రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ అంతకు ముందు ఆయన మంచి హాస్య భరిత చిత్రాలు కొన్ని చేశారు. ఒకవేళ కోడి రామకృష్ణ పరిచయం కాకపోయి ఉంటే ఇమేజ్ కూడా మారి ఉండేది. హస్యబ్రహ్మ జంధ్యాల గారి కాంబినేషన్ లో రాజశేఖర్ చేసిన ఒకే ఒక్క సినిమా ‘నీకు నాకు పెళ్ళంట’. అది జంధ్యాల దర్శకుడిగా మంచి ఫామ్ లో డిమాండ్ లో ఉన్న సమయం. ‘అహ నా పెళ్ళంట’ చిత్రం స్టార్లు సైతం షాకయ్యే రీతిలో బ్లాక్ బస్టర్ కాగా ఆ తర్వాత మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబుతో చేసిన ‘చిన్ని కృష్ణుడు’ నిరాశపరిచింది. వెంటనే ‘వివాహ భోజనంబు’తో తిరిగి ఫామ్ లోకి వచ్చేశారు.
అప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, భానుమతి, నరేష్ లాంటి అగ్ర తారలతో సినిమాలు తీసిన అనుభవం ఉన్న జంధ్యాల ఈసారి రాజశేఖర్ ని ఎంచుకున్నారు. సుప్రసిద్ధ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఇదే టైటిల్ తో రాసిన నవలను కథగా ఎంచుకున్నారు. ఈ కాంబోలో చంటబ్బాయి ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. ఓ బామ్మను ప్రధాన పాత్రగా చేసి హీరో హీరోయిన్లను కలిపే ఓ సరదా ప్రేమ కథగా ఈ సినిమా సాగుతుంది. క్యారెక్టర్ కోసం నటి రత్నసాగర్ నిజంగానే గుండు చేయించుకోవడం ఓ సంచలనం. టాలీవుడ్ చరిత్రలో పాత్ర కోసం మొత్తం జుత్తు తీసేసిన నటీమణి ఎవరూ లేరు. అందుకే ఆవిడ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.
హీరోయిన్ గా అశ్వని ఎంపిక కాగా పూర్ణిమ, చంద్రమోహన్, నూతన్ ప్రసాద్, సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, రాజ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు ఇతర తారాగణం. గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రమణ్యం సంగీతం అందించగా సి విజయ్ కుమార్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. కామెడీగా సాగే వన్ సైడ్ లవర్ గా రాజశేఖర్ డిఫరెంట్ గా కనిపిస్తారు. 1988 ఆగస్ట్ 26న రిలీజైన నీకు నాకు పెళ్ళంట మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అహ నా పెళ్ళంట స్థాయి కాకపోయినా ప్రేక్షకులను నవ్వించడంలో ఫెయిల్ కాలేదు. ఇందులో ఉన్న 5 పాటలు మ్యూజికల్ గానూ పేరు తెచ్చుకున్నాయి.