iDreamPost
iDreamPost
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నది సామెత. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చాక అధికారుల పనిపడతాం. ఎవరినీ వదలం అని అంటుంటే ఆయన తనయుడు లోకేశ్ తాము అధికారంలోకి వచ్చాక ఏకంగా ఒక్కొక్కడి అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు లోకేశ్ బుధవారం అనంతపురంలో పర్యటించారు. కార్యకర్తలు.. ప్రభుత్వం తమపై కేసులు పెడుతోందని ఫిర్యాదు చేశారు. స్పందించిన లోకేశ్ ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోమనండి.. నేేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ల అంతూ చూస్తా అని అన్నారు. అనంతరం ఎయిడెడ్ కాలేజీల విలీనంపై విద్యార్థి సంఘం నేతలతో చర్చలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను కొట్టి.. ఇప్పుడు కొట్టలేదని చెబుతున్నారని తప్పుబట్టారు.
కేసులు పెట్టడమే ప్రభుత్వం పనా?
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు తమ కార్యకర్తలను రెచ్చగొడుతూ మాట్లాడడం, వారి రెచ్చిపోయి ప్రభుత్వ ఆస్తులపై దాడులకు పాల్పడడం ఇటీవల ఎక్కువైంది. దీంతో అనివార్యంగా పోలీసులు కేసు పెడుతుంటే.. ప్రభుత్వం వేధిస్తోందంటూ యాగీ చేయడం, తమ మీడియాలో రచ్చ చేయడం దాదాపు రోజువారీ వ్యవహారంగా తెలుగుదేశం నాయకులు మార్చేశారు. టీడీపీ నాయకులపై కేసులు పెట్టడం తప్ప పోలీసులకు, ప్రభుత్వానికి వేరే పని లేదా? ఏదోవిధంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చంద్రబాబు, లోకేశ్ దర్శకత్వంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా వారి పప్పులు ఉడకకపోవడంతో బహిరంగంగానే కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటన సమయంలో ఆయన సమక్షంలోనే ఒక ప్రభుత్వ ఉద్యోగిని టీడీపీ కార్యకర్తలు రక్తమోడేలా దారుణంగా కొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఉద్యోగిపై దాడి జరుగుతున్న సమయంలో బాబు మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తన అసలు ఉద్దేశం ఏమిటో అందరికీ తెలిసిపోయేలా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన తనయుడు రోడ్డెక్కి విద్యార్థులను రెచ్చగొట్టే పనిచేశారు. తమను ఎవరూ కొట్టలేదని విద్యార్థులు చెబుతున్నా వినకుండా లేదు కొట్టారు అంటూ లోకేశ్ వాదించడాన్ని బట్టే ఆయనగారి పర్యటన ఉద్దేశం అర్థమవుతోంది.
ప్రభుత్వం స్పష్టం చేసినా అవే ఆరోపణలు
ఎయిడెడ్ విద్యాసంస్థల భూములపై సీఎం జగన్ కన్నేశారని లోకేశ్ ఆరోపించారు. ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేట్ చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడకుండా జీవో విడుదల చేశారని వారం రోజుల్లో జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలు అంగీకరిస్తేనే ప్రభుత్వంలో విలీనం చేస్తామని, బలవంతం చేయట్లేదని, ముఖ్యమంత్రి, విద్యామంత్రి స్పష్టంగా చెబుతున్నా టీడీపీ నేతలు ఉద్దేశ పూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి అందరికీ అర్థమవుతున్నా ఇంకా ఎవరిని నమ్మించాలని తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నారో.. వారికే తెలియాలి.
ఈ క్రియేటివిటీ అప్పుడేమైంది..
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పథకాలకు జగనన్న పేరు పెడుతున్నారని. జగనన్న కాదు.. జగనన్న దున్న అని పెట్టాలని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయిదేళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా, చంద్రన్న బీమా అంటూ పలు పథకాలకు పేర్లు పెట్టుకున్న మీరు చంద్రన్న దున్న, చంద్రన్న గేదె వంటి పేర్లు ఎందుకు పెట్టుకోలేదు. అప్పుడు మీలోని ఈ క్రియేటివిటీ ఏమైంది? ముఖ్యమంత్రిని రోజుకోరకంగా అసభ్యకరమైన, అభ్యంతరకరమైన భాషలో దూషిస్తే మీ ఇమేజ్ పెరిగిపోతోందనుకుంటున్నారా? అత్యంత ప్రజాదరణ ఉన్న జగన్ను కించపరిస్తే జనం దృష్టిలో మీరు పలుచన అవుతారు. జగన్ను ఎన్నుకున్న జనాన్ని కించపరిచేలా, రెచ్చగొట్టేలా మాట్లాడితే రాజకీయంగా మీకే నష్టం అన్న సంగతి గమనిస్తే మంచిది.
Also Read : Muncipal Nominations, Chandrababu, TDP – అడ్డుకుంటే.. అన్ని నామినేషన్లు ఎలా వేశారు బాబూ..?