iDreamPost
android-app
ios-app

పసుపు చైతన్యం లోకేష్‌ నుంచే మొదలు పెట్టాల్సిందట..!

పసుపు చైతన్యం లోకేష్‌ నుంచే మొదలు పెట్టాల్సిందట..!

మళ్లీ నువ్వే రావాలి అనే స్లోగన్లు, సొంత సర్వేలు, అనుకూల మీడియా సర్వేలలో మళ్లీ మనదే అధికారం అనే భావనలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు 2019 ఎన్నికల ఫలితాలతో కళ్లు బైర్లుకమ్మాయి. సాదాసీదా కాకుండా ఘోర ఓటమిని చూవిచూడడంతో ఆకాశంలో ఉన్న చంద్రబాబు నేలకుదిగారు. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను నిర్లక్ష్యం చేశానని ఒప్పుకుంటూ.. కలిసికట్టుగా పోరాడి మళ్లీ అధికారం సాధిద్దామంటూ పిలుసునిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓటమి తర్వాత పార్టీకి దూరమైన కార్యకర్తలు, నైరాష్యంలో ఉన్న టీడీపీ అభిమానులను కార్యోన్ముఖులను చేసేందుకు ‘పసుపు చైతన్యం’ పేరిటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వంద రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు తలపెట్టారు.

ఏడు పదుల వయస్సులోనూ చంద్రబాబు చేస్తున్న రాజకీయ పోరాటాన్ని విమర్శకులు సైతం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అయితే అధికారంలోకి వచ్చేందుకు చేపట్టిన పసుపు చైతన్యం కార్యక్రమం ముందు తన ఇంటి నుంచే ప్రారంభించాలని చంద్రబాబు విమర్శలకులతో సహా ఆయన హితం కోరే వారు చెబుతున్న మాట. ఎందుకంటే తన వారసుడిగా, టీడీపీ బావి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న నారా లోకేష్‌ రాజకీయం ఇంకా పాత చింతకాయ పచ్చడిలా, అరిగిపోయిన గ్రామ్‌ రికార్డర్‌ను తలపిస్తోందనే మాట వినిపిస్తోంది. భవిష్యత్‌ను ఊహించి వర్తమానంలో రాజకీయాలు చేయాల్సిన నారా లోకేష్‌ తన రాజకీయ ప్రత్యర్థి వైఎస్‌ జగన్‌ను ఇబ్బంది పెట్టడంలో విఫలమవుతున్నారని ఆయన చేస్తున్న ఆరోపణలను బట్టి అర్థం అవుతోంది.

తాజాగా నారా లోకేష్‌ సీఎం వైఎస్‌ జగన్‌పై మునుపటిలాగే లక్ష కోట్ల ఆరోపణలు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచేశారని నొక్కి మరీ చెప్పారు. ఇక్కడే లోకేష్‌ పరిజ్ఞానం అర్థం అవుతోందని, అందుకే చంద్రబాబు ముందు తన కుమారుడును చైతన్యవంతుడిని చేయాలనే సలహాలు వస్తున్నాయి.

2014 ఎన్నికల్లో లక్ష కోట్ల ఆరోపణలు చేశారు. ఐదేళ్లు తాము అధికారం చెలాయించి, చెప్పుకునేందుకు ఏమీ లేక మళ్లీ 2019లోనూ జగన్‌పై అవే లక్ష కోట్ల ఆరోపణలు చేశారు. సరే.. ఆ మాట మీద నిలబడ్డారా..? అంటే.. అదీ లేదాయో. జగన్‌కు ఎన్నికల ఖర్చు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెయి కోట్లు పంపుతున్నాడని ఆరోపించారు. ఆ డబ్బు రాష్ట్రంలోకి రాకుండా సరిహద్దుల్లోనే అడ్డుకోవాలని మరీ బాబు, లోకేష్‌లు పిలుపులు ఇచ్చారు.

ఇక్కడే ప్రజలకు అసలు విషయం బోధపడింది. చంద్రబాబు, లోకేష్‌లు చెప్పినట్లు జగన్‌ లక్ష కోట్టు దోచేస్తే.. మళ్లీ ఎన్నికల ఖర్చు కోసం కేసీఆర్‌ వద్ద వెయి కోట్లు తీసుకోవాల్సిన అవసరం ఏముంది..? లక్ష కోట్లలో వెయి కోట్లు అంటే.. ఒక్క శాతం. బాబు, లోకేష్‌లే తాము చేసిన ఆరోపణలు సత్యదూరమని చెప్పకనే చెప్పారు. అయినా మళ్లీ లోకేష్‌ జగన్‌పై అదే లక్ష కోట్ల ఆరోపణలు చేస్తూ.. జగన్‌ను ఏ విధంగా ఇరుకునపెట్టగలరనేదే టీడీపీ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. అందుకే చంద్రబాబు అండ్‌ కో.. పసుపు చైతన్యం కార్యక్రమం ముందు లోకేష్‌ నుంచి మొదలుపెట్టి ఉంటే బాగుండేదని రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సలహా.