iDreamPost
android-app
ios-app

నాగార్జున‌సాగ‌ర్ : జానా జ‌యించేనా..?

నాగార్జున‌సాగ‌ర్ : జానా జ‌యించేనా..?

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారింది. వ‌రుస ఓట‌మిల‌తో కునారిల్లుతున్న కాంగ్రెస్ కు ఇప్పుడు జానారెడ్డి ఆశాదీపంగా మారారు. జానారెడ్డి కాంగ్రెస్ లో మోస్ట్ సీనియర్ లీడర్. ఆయన గ‌తంలో నాగార్జున సాగర్ లో వరుసగా గెలిచి మంత్రి అయ్యారు. 2018 ఎన్నిక‌ల్లో మాత్రం ఓడిపోయారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ మరణంతో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ నుంచి జానారెడ్డి మ‌ళ్లీ పోటీకి దిగారు. స్థానికంగా త‌నకున్న ప‌ర‌ప‌తి, ప‌రిచ‌యాల‌తో గెలిచి తీర‌తానంటూ ఆయ‌న మొద‌టి నుంచీ బీరాలు ప‌లుకుతూనే ఉన్నారు. వాటిని నెర‌వేర్చుకునే క్ర‌మంలో అంద‌రి కంటే ముందుగానే ప్ర‌చారం కూడా ప్రారంభించారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని ఇప్ప‌టికే రెండు సార్లు చుట్టేశారు. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు మంచి ఇమేజ్ ఉన్నా.. పార్టీప‌రంగా గెలిచే ప‌రిస్థితులు లేవ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నాగార్జున సాగ‌ర్ లో జానారెడ్డి విజ‌యంపై అంత‌టా ఆస‌క్తి ఏర్ప‌డింది.

అతి న‌మ్మ‌కంతో వెళ్తున్నారా..?

నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ ఆ పార్టీ తెలంగాణ పుంజుకుంటుందని కాంగ్రెస్ వాదులు అనుకుంటున్నారు. కానీ, జానారెడ్డి అతి న‌మ్మ‌కం కొంప ముంచేలా ఉంది. నేను 6-7 సార్లు గెలిచాను నాకు తిరుగు లేదు అనుకుంటూ ఆయ‌న ముందుకెళ్తున్నారు. కానీ, ఎందుకంటే టీఆర్ఎస్ ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన తర్వాత ఆ పార్టీ ఆత్మవిశ్వాసంతో నాగార్జున సాగర్ కు రెడీ అవుతోంది. బీజేపీ కూడా గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది.

ఇలాంటి స‌మ‌యంలో జానారెడ్డి ఓవ‌ర్ కాన్ఫిడెంట్ తో కాకుండా అందరినీ కలుపుకొని పోతే మంచిద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఉన్న ఉత్తమ్ కోమటిరెడ్డి బ్రదర్స్ ను కూడా నాగార్జున సాగర్ కు ఆహ్వానిస్తే మంచిది అని ప‌లువురు సూచిస్తున్నారు. లాస్ట్ లో రేవంత్ రెడ్డి లాంటి బలమైన వాయిస్ వినిపించే నేతలను పిలిచి అన్ని మండలాల హెడ్ క్వార్టర్స్ లో మీటింగ్ పెడితే కాంగ్రెస్ కు ఊపు వస్తుందని సలహాలు ఇస్తున్నారట.. కానీ దీన్ని జానారెడ్డి కానీ.. పార్టీ అధిష్టానం కానీ పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారట.

హోరాహోరీ పోరులో నాడు ఓట‌మి

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి నోముల నర్సింహయ్య, కాంగ్రెస్‌ నుంచి జానా రెడ్డి నిలబడ్డారు. ఆ ఇద్దరి మధ్యే హోరాహోరీ పోరు కొనసాగింది. నోములకు 83,655 ఓట్లు పోలవ్వగా.. జానారెడ్డికి 75,884 ఓట్లు పోలయ్యాయి. కేవలం 4 శాతం (7, 771) ఓట్ల తేడాతో జానారెడ్డి ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో కూడా జానారెడ్డి లేదా.. ఆయన కుమారుడిని ఇక్కడి నుంచి రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగినా, చివ‌ర‌కు జానారెడ్డికే అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. పార్టీ ప్రతిష్ఠ కాస్త అయినా పెరగాలంటే నాగార్జునసాగర్‌లో గెలుపు చాలా అవసరం. అందుకే ఇప్పటికే నుంచే జానారెడ్డి స్థానికంగా రాజకీయాలు, ప్రచారాలు ప్రారంభించారు. ఎలాగైనా అక్కడ గెలుపుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగేవరకూ టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేయవద్దని అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ సహా కొంత మంది పెద్దలతో ఫోన్‌ ద్వారా కూడా విజ్ఞప్తి చేశారు. ఆయ‌న నిర్ణ‌యాన్ని అధిష్ఠానం కూడా మ‌న్నించింది. త‌న గెలుపు కోసం అన్ని విధాలుగానూ ఆలోచిస్తున్న జానారెడ్డి ఇత‌ర సీనియ‌ర్ల‌ను క‌లుపుకుంటున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. మ‌రి ప్ర‌చార‌ప‌ర్వంలో మార్పు క‌నిపిస్తుందేమో చూడాలి.