iDreamPost
iDreamPost
రేపు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ నిర్ణయం తీసుకోబోతుంది.ఈ పంటలకు సాగుకు రైతుకు వాస్తవంగా ఎంత ఖర్చు అవుతుంది,స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఎకరాకు ఎంత గిట్టుబాటు ధరకల్పిస్తే రైతుకు న్యాయం జరుగుతుందో చెప్పే విశ్లేషణ ,
ఆంధ్రాకు అన్నపూర్ణ పేరు తెచ్చిన వరి .
మరి ఆ వరి పండించే రైతుకి దక్కుతుందా గిట్టుబాటు సిరి . ఖరీఫ్ , రబీ రెండు సార్లు వరికి పుష్కలంగా నీరందే ప్రాంతాల్లో ముప్పై వేలు వరకూ ముందస్తు కవులు , ఒక పంటకి నీరు అందే చోట 12 బస్తాలు లేదా పదిహేను వేల సగటు కవులు నడుస్తుంది ప్రస్తుతం . ఆ ప్రకారం లెక్కించి మిగతా ఖర్చులు ఏ ధరైతే గిట్టుబాటు అవుతుందో చూద్దాం . కవులు = 15000
దుక్కి గొర్రు ,దమ్ము = 2600
విత్తనం , నారుమడి. = 3000
నాట్లు = 3000
ఎరువులు , కూలీ. = 6000
పురుగుమందు,కూలీ = 6000
కలుపు,మట్టి,పైపనులు =2500
మిషన్ కోత , ప్రాసెస్ , = 4000
గోతాలు , తోలకం. = 2000
మొత్తం ఖర్చు ఎకరాకు= 44100
33 నుండి 43 బస్తాల దిగుబడిలో సగటు 38 బస్తాలు .స్వామినాథన్ కమిటీ మొత్తం పెట్టుబడి సొమ్ములో 50% ఆదాయాన్ని లెక్కించి రైతుకు ఇవ్వమని సిఫార్సు చేసింది ఆ లెక్క ప్రకారం 44100 + 44100 లో 50 శాతం = 66000 – ఇది 38 బస్తాల దిగుబడి. ఒక బస్తా దిగుబడి 66000 ÷ 38 = 1730 . అంటే బస్తాకు 1730 రూపాయాలు ఇస్తే రైతులకు గిట్టుబాటవుతుంది.
వరి ప్రధాన ఆహారం , విస్తృతంగా సాగయ్యే పంట అయినందున ఆహార భద్రత కోసం , ఈ ధర ఇవ్వకపోయినా అదే కవులలో మరో స్వల్పకాలిక పంట అవకాశాలను బట్టి పది శాతం తగ్గించినా 1550 రూపాయలు అనేది కనీస గిట్టుబాటు ధర .
పసిడెత్తు పసుపు గిట్టుబాటు ధర ఎంత ?
పసుపు నాలుగేళ్లు గిట్టకపోయినా ఒక్కేడు సరిగ్గా రేటు వస్తే ఆ దండగ అంతా కొట్టుకుపోయిద్ది అని వాడుక . మరి ఆ పసుపు రైతుకి పెట్టుబడి ఎంత అవుతుంది . ఏ రేటు లభిస్తే గిట్టుబాటు అవుతుందో చూద్దామా .
మన రాష్ట్రంలో పండించే పంటలన్నింట్లో దీర్ఘకాల పంట ఏది అంటే పసుపు అనే చెప్పొచ్చు . 270 నుండి 300 రోజులకి పంట చేతికొస్తుంది . మిర్చికి గుంటూర్ యార్డ్ ఎంత ప్రసిద్ధో , పసుపుకి దుగ్గిరాల యార్డ్ అంత ప్రసిద్ధి . ఎక్కువగా గుంటూర్ , కృష్ణా , ఉభయ గోదావరి జిల్లాల్లో సాగయ్యే పసుపు , సీమలో మాత్రం కడప జిల్లా ప్రత్యేకించి మైదుకూరులో ఎక్కువగా పండిస్తారు . తెనాలి , కొల్లిపర ప్రాంతాల రైతులకు పసుపు విత్తనం కడప నుండి వచ్చేదే ఎక్కువ .
పెట్టుబడి విషయానికొస్తే
కౌలు =40000
దుక్కి నాగళ్ళు , గొర్రు = 3500
గొర్రె లేదా బర్రెల ఎరువు= 8000
విత్తనం ఆరు పుట్లు. =18000
నాగళ్ళు , నాటు కూలీ = 5000
ఎరువులు , కూలీ = 8000
పురుగు మందు , కూలీ = 5000
కలుపు కూలీ = 1000
నీళ్లు కట్టే పని , కూలీ = 5000
ఆకుతీత = 4000
దున్నకం , ఏరిన కూలీ = 6000
వండినందుకు = 9500
డ్రై ప్రాసెస్ కూలీ = 2000
పాలిష్ వర్క్ = 2000
మొత్తం పెట్టుబడి = 117000 .
స్వామినాథన్ కమిటీ సిఫార్సు ప్రకారం పెట్టుబడి మీద 50 శాతం ఆదాయాన్ని లెక్కిస్తే 58500 అవుతుంది .117000+58500 = 175500 .
దిగుబడి 13 నుండి 17 పుట్లు . సరాసరిన 30 క్వింటాలు వస్తుంది .
175500 ÷30 క్వింటాళ్లు = 5850 .
అంటే పసుపు గిట్టుబాటు ధర క్వింటాకి ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు .
ప్రభుత్వం ఈ రోజు ప్రకటించే గిట్టుబాటు ధరల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రైతుల పెట్టుబడి ఖర్చును దృష్టిలో పెట్టుకొని గిట్టుబాటు ధరని నిర్ణయించాలి.