iDreamPost
android-app
ios-app

విస్తరణ దిశలో మేఘా, ఐపీవో కి సిద్ధమవుతున్న కాంట్రాక్ట్ సంస్థ

  • Published Sep 29, 2021 | 5:28 AM Updated Updated Sep 29, 2021 | 5:28 AM
విస్తరణ దిశలో మేఘా, ఐపీవో కి సిద్ధమవుతున్న కాంట్రాక్ట్ సంస్థ

దేశంలో ఐపీఓల దశ నడుస్తోంది. వరుసగా పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే జొమాటో వంటి కంపెనీలకు ఆదరణ లభించింది. త్వరలో మరిన్ని కంపెనీలు అటువైపు అడుగులు వేస్తున్నాయి. అదే సమయంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ (ఎంఈఐఎల్) కూడా సన్నద్ధమవుతోంది. సంస్థను కొత్త టెక్నాలజీతో విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా పెట్టుబడుల సమీకరణకు ప్రయత్నాలు ప్రారంభిస్తోంది.

తాము ఐపీవో కి వెళ్లబోతున్న విషయాన్ని మేఘా ఎండీ పి వి కృష్ణారెడ్డి వెల్లడించారు. ఎప్పటికలోగా ఐపీవోకి వెళతారు, ఎంత మొత్తం సమీకరించదలుచుకున్నారనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఇటలీకి చెందిన కంపెనీతో కలిసి హైడ్రోజన్ టెక్నాలజీ సంబంధిత రంగంలో పనిచేస్తున్నట్టు తెలిపారు. ఏపీ, తెలంగాణాలో కూడా కీలక ప్రాజెక్టులను మేఘా చేపట్టింది. కాళేశ్వరం వంటి తెలంగాణా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేయడం ద్వారా మేఘా మంచి గుర్తింపు సాధించింది. ఏపీలో జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టుని కూడా మేఘా సంస్థ రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్ట్ తీసుకుని పనుల్లో పురోగతి చూపిస్తోంది.

Also Read : బద్వేల్ ఉప ఎన్నిక : వైసీపీ అభ్యర్థి ఖరారు

కశ్మీర్ కి సంబంధించిన జోజిలా టన్నెల్ సకాలంలో పూర్తి చేయడంంలో మేఘా తన కీర్తిని పెంచుకుంది. శ్రీనగర్- లేహ్ మధ్య ఈ టన్నెల్ నిర్మాణం అనేక విధాలుగా తోడ్పడబోతోంది. దానిని నిర్ధిష్ట గడువు కన్నా ముందే అందుబాటులోకి తీసుకురావడం మేఘా ఘనతను చాటుతోంది. పర్యాటక, ఇతర రంగాల పురోభివృద్ధికి ఈ టన్నెల్ కీలక పాత్ర పోషించబోతోంది. ఇప్పటికే మేఘా సంస్థ ఉత్తరాఖండ్ సహా పలు చోట్ల టన్నెల్ నిర్మాణంలో నైపుణ్యం సాధించింది. ఏపీలోని వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్స్ కూడా మేఘా ఆధ్వర్యంలోనే పనులు జరుగుతుండడం విశేషం.

ప్రస్తుతం 35వేల సిబ్బంది పనిచేస్తున్న మేఘా కి కాంట్రాక్టుల, మౌలిక వసతుల కల్పనా రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ప్రాధాన్యత దక్కుతోంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో కూడా అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా 1000 బస్సులు నడుపుతున్నట్టు ఆ సంస్థ ఎండీ తెలిపారు. ఇక ఆఫ్ షోర్, ఆన్ షోర్ రిగ్గుల తయారీ, ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణం, విద్యుత్ పంపిణీ రంగాల్లో కూడా ఎంఈఐఎల్ ముందంజ వేస్తోంది. ప్రస్తుతం 15 దేశాల పరిధిలో ఈ సంస్థ కార్యకలాపాలు జరుగుతున్నాయి. త్వరలో వాటిని మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో సాగుతున్నారు.

Also Read : కుప్పం ఓటమిని మభ్యపెట్టేందుకేనా పవన్ దాడి?

కేంద్రం పెట్టుబడల ఉపసంహరణకు మొగ్గు చూపుతున్న తరుణంలో షిప్పింగ్ కార్పోరేషన్, బీఈఎంల్, నీలచల్ ఇష్పాత్ లిమిటెడ్ వంటి సంస్థలపై మేఘా దృష్టి సారించింది. దానికి అనుగుణంగా రూ. 15వేల కోట్ల నుంచి రూ. 20వేల కోట్ల వరకూ నిధులు సమీకరణ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే విదేశాల నుంచి సైతం సమీకరించే నిధులు కూడా దేశంలోనే పెట్టుబడులుగా పెట్టాలని, విదేశాల్లో పెట్టుబడులు పెట్టే యోచనలో లేమని మేఘా ప్రకటించింది.