Idream media
Idream media
కొంత కాలంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్రం మధ్య ఫైట్ కొనసాగుతూనే ఉంది. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా.. కాదేదీ వివాదాలకు అనర్హం అన్న చందంగా పొలిటికల్ వార్ కొనసాగుతూనే ఉంది. కరోనా, వ్యాక్సిన్, ఇంజక్షన్, తుఫాను, చివరకు అధికారుల బదిలీలు.. ఇలా ప్రతీ అంశమూ కేంద్రం, మమత మధ్య కోల్ట్ వార్ కు దారి తీస్తోంది. తుపానుపై సమీక్ష సమావేశానికి దీదీ ఆలస్యంగా రావడం, వెళ్లిపోవడం దీదీ ఉద్దేశ్యపూర్వకంగానే చేశారని బీజేపీ ఆరోపణలు కొనసాగుతుండడం, గవర్నర్తో పాటు కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా కూడా దీనిపై ట్వీట్ల ద్వారా గరం గరం కావడం చల్లారక ముందే.. సీఎస్ బదిలీ వ్యవహారం పొలిటికల్ వేడిని రగిల్చింది.
యాస్ తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మమతా.. సీఎస్తో సహా ఉన్నతాధికారుల్ని కూడా ఉద్దేశ్యపూర్వకంగానే హాజరుకావొద్దని ఆదేశించినట్లు కేంద్రం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యకార్యదర్శి అలపన్ బందోపాధ్యాయను వెనక్కి పంపించాల్సిందిగా బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర ఆదేశాలు జారీ చేసింది.
అంతకు ముందే బందోపాధ్యాయ కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగించిన కేంద్రం వెంటనే ఇలా వ్యవహరించడాన్ని మమతా బెనర్జీ సీరియస్ గా తీసుకున్నారు. కాగా, ఉన్నతాధికారులను కేంద్రం వెనక్కి తీసుకోవడం ఇదేం కొత్త కాదు. బెంగాల్ ఎన్నికలకు ముందు ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్రం వెనక్కి తీసుకుంది. అయితే అలపన్ బందోపాధ్యాయను రూల్స్ ప్రకారమే కేంద్రం వెనక్కి తీసుకుంటోందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సోన్నెల్ అండ్ ట్రైనింగ్ తెలిపింది. మమత అధికారంలో ఉండగా, సీఎస్ ను వెనక్కి పిలవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తనదైన శైలిలో చక్రం తిప్పారు.
మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. తన పంతం నెగ్గించుకునేందుకు ఆలాపన్ బందోపాధ్యాయను బెంగాల్ సీఎస్ పదవికి రాజీనామా చేయించి ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. సోమవారం ఆలాపన్ బందోపాధ్యాయ బెంగాల్ సీఎస్ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా సీఎం మమతా బెనర్జీకి ముఖ్య సలహాదారుగా చేరిపోయారు. నెలకు రూ.2.5 లక్షల వేతనంతో ఆలాపన్ బందోపాధ్యాయను మమతా తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన మూడేళ్లపాటు ఆమె వద్ద పని చేయనున్నారు. ఈ వివాదం అంతటితో ఆగలేదు. కేంద్రం ఆదేశాల ప్రకారం.. కేంద్ర సర్వీసులకు తిరిగి రానందుకు బందోపాధ్యాయకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.