iDreamPost
android-app
ios-app

ప్రముఖ కూచిపూడి కళాకారిణి శోభానాయుడు కన్నుమూత

ప్రముఖ కూచిపూడి కళాకారిణి శోభానాయుడు కన్నుమూత

ప్రముఖ డాన్సర్ కూచిపూడి కళాకారిణి శోభానాయుడు(58) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

వివరాల్లోకి వెళితే కొంతకాలం క్రితం శోభ నాయుడు ఇంటిలో జారిపడటంతో ఆమె తలకు గాయం అయింది. గాయం కారణంగా ఆమె ఆర్థో న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. దానికి తోడు ఆమెకు కరోనా కూడా సోకడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడటానికి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

శోభా నాయుడు వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరి కూచిపూడిలో శిక్షణ పొందారు. అనేకచోట్ల కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చి ప్రజల మనసులను చూరగొన్నారు. కూచిపూడి ప్రదర్శనల ద్వారా ఆమె చూపిన ప్రతిభకు గాను ఆమెను భారత దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీ అవార్డు కూడా వరించింది.1998లో ఎన్టీఆర్‌, 1982లో నిత్య చూడామణి, 1991లో సంగీత నాటక అకాడమీ పురస్కారాలు అందుకున్నారు.యూకే, సిరియా, టర్కీ, హాంకాంగ్‌, మెక్సికో, వెనిజులా, క్యూబా తదితర దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు

అనంతరం ఆమె కూచిపూడి డాన్స్ అకాడెమీని ఏర్పాటుకి చేసి దాని ద్వారా పలువురికి శిక్షణ అందించారు. ఆమె వద్ద శిక్షణ పొందిన అనేకమంది దేశ విదేశాల్లో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. శోభానాయుడు భర్త అర్జున్ రావు మాజీ ఐఏఎస్ అధికారిగా దేశానికి సేవలు అందించారు. కాగా శోభా నాయుడు మరణవార్తను తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.. .