Idream media
Idream media
కరోనా మొదటి దశలో తెలంగాణలోని ఆస్పత్రులను అప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పీపీఈ కిట్ లు ధరించి ఒకటి రెండు సార్లు సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఇతర మంత్రులు కానీ సందర్శించలేదు. రాజేందర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన అనంతరం ఆ శాఖ సీఎం వద్దే ఉంచుకున్నారు. ఆస్పత్రుల్లోని పరిస్థితులపై అధికారులతో మాట్లాడడం తప్ప నేరుగా పరిశీలించలేదు. ఈటల ఉన్న సమయంలో కరోనా కేసులు, ఆస్పత్రుల్లో ఖాళీలపై రోజూ అప్ డేట్ ఇచ్చేవారు. కరోనా నుంచి కోలుకుని ప్రగతిభవన్ కు వచ్చిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్ అనంతరం కొద్ది రోజులకే కొవిడ్ ఆస్పత్రిగా సేవలు అందిస్తున్న గాంధీని సందర్శించారు. పీపీఈ కిట్ కానీ, ఫేస్ ఫీల్డ్ కానీ, చేతులకు గ్లౌజ్ లు కానీ లేకుండా మాస్క్ లు మాత్రమే ధరించి నేరుగా కరోనా వార్డుల్లో తిరిగారు కేసీఆర్.
రోగుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ఒకటి కాదు రెండు సార్లు చేసి ఇలా ఆస్పత్రుల్లోని రోగులతో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. గాంధీ ఆసుపత్రిలో మాత్రమే కాదు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనూ ఇదే రీతిలో వ్యవహరించిన కేసీఆర్ తీరు హాట్ టాపిక్ గా మారింది. అప్పటివరకు కొవిడ్ ఎపిసోడ్ లో కేసీఆర్ తీరును విమర్శించిన వారు..వేలెత్తి చూపించిన వారంతా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. అంతేకాదు.. కొవిడ్ వార్డుల్ని సందర్శించే సమయంలో పీపీఈ కిట్.. చేతికి గ్లౌజ్ లాంటివి ఏమీ లేకుండా.. కేవలం డబుల్ మాస్కుకు పరిమితమైన వైనం అందరిని ఆకర్షించింది.
ఇదిలా ఉంటే.. తాజాగా తండ్రికి తగ్గట్లే తనయుడు కేటీఆర్ సైతం టిమ్స్ లో అదేరీతిలో వ్యవహరించారని చెప్పాలి. తండ్రిని గుర్తుకు తెచ్చేలా డబుల్ మాస్కుకు పరిమితమయ్యారు. కొవిడ్ వార్డుల్లో ఉత్సాహంగా తిరిగిన ఆయన.. పేషెంట్లకు అతి సమీపానికి వెళ్లారు. వారిని పలుకరించటమే కాదు.. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. మొత్తానికి తన తండ్రి చేసిన సాహసాన్నే తనయుడు కేటీఆర్ కూడా చేసి చర్చనీయాంశంగా మారారు.