iDreamPost
iDreamPost
ప్రతిపక్షాలను చీల్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన బీజేపీ శాసనమండలిలో మెజారిటీ సాధించాలన్న లక్ష్యానికి ఒక్క సీటు దూరంలో ఆగిపోయింది. ఆ రాష్ట్రంలో 25 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ ఎన్నికల కౌంటింగ్ చివరి దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం బీజేపీ 12 చోట్ల విజయం సాధించగా కాంగ్రెస్ 11 సీట్లు గెలిచింది. మరో ప్రధాన పార్టీ జేడీఎస్ ఒక్క సీటుకే పరిమితం అయ్యింది. గత జనవరి ఐదో తేదీన 25 మంది సభ్యులు రిటైర్ అయ్యారు. వారిలో కాంగ్రెసుకు చెందిన వారు 14 మంది కాగా బీజేపీకి చెందినవారు ఏడుగురు, జేడీఎస్ సభ్యులు నలుగురు ఉన్నారు. తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ మూడు సీట్లు కోల్పోయినప్పటికీ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చి మెజారిటీకి అవసరమైనన్ని సీట్లు గెలవకుండా అడ్డుపడింది. బీజేపీ ఐదు సీట్లు అదనంగా సంపాదించినా లక్ష్యం సాధించలేకపోయింది.
మెజారిటీ మార్క్ 38
శాసనమండలిలో మొత్తం 75 సీట్లు ఉన్నాయి. మండలిలో మెజారిటీకి 38 మంది సభ్యులు అవసరం. జనవరి ఐదో తేదీకి ముందు బీజేపీకి 32 మంది, కాంగ్రెసుకు 29 మంది, జేడీఎస్ కు 12 మంది ఉండేవారు. దాంతో ప్రభుత్వం బిల్లులు పాస్ చేయించుకునేందుకు ఇతర సభ్యులపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ తరుణంలో 25 మంది సభ్యులు రిటైర్ కావడం.. ఎన్నికలు రావడంతో ఎలాగైనా ఎక్కువ సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నించింది. కానీ చివరికి ఒక్క సీటు దూరంలో నిలబడిపోయింది.
తాజా బలాలు ఇలా..
అధికార బీజేపీకి ఉన్న 32 మందిలో ఏడుగురు రిటైర్ కావడంతో బలం 25కు తగ్గింది. ప్రస్తుత ఎన్నికల్లో 12 సీట్లు గెలుచుకోవడంతో బీజేపీ సభ్యుల సంఖ్య 37కు పెరిగింది. కాంగ్రెసుకు ఉన్న 29 మందిలో 14 మంది రిటైర్ కాగా.. ప్రస్తుతం 11 మంది గెలిచారు. అంటే కాంగ్రెస్ తాజా బలం గతం కంటే మూడు తగ్గి 26 అయ్యింది. ఈ ఎన్నికల్లో జేడీఎస్ బాగా దెబ్బతింది. కౌన్సిల్లో ఇంతకు ముందు ఆ పార్టీ బలం 12 కాగా నలుగురు రిటైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవడంతో ఆ పార్టీ మూడు సీట్లు కోల్పోయి 9 వద్ద నిలిచింది. పార్టీకి కంచుకోట అయిన మాండ్యా జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా జేడీఎస్ ఓడిపోవడం విశేషం. అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఈ ఎన్నికల్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలిచారు.
Also Read : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు హవా. ఆరుకు ఆరు సీట్లు కైవసం!