iDreamPost
android-app
ios-app

కమల్ నాథ్ వర్సెస్ శివరాజ్ సింగ్ చౌహాన్: బిజెపికి ఆ నేతల రాజీనామా నష్టం చేస్తుందా..?

కమల్ నాథ్ వర్సెస్ శివరాజ్ సింగ్ చౌహాన్: బిజెపికి ఆ నేతల రాజీనామా నష్టం చేస్తుందా..?

మధ్యప్రదేశ్‌లో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. 24 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఈ ఉప ఎన్నికలు‌ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎవరు అధికారంలో ఉండాలనేది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో నిర్ణయించే ఈ ఉప ఎన్నికలను బిజెపి, కాంగ్రెస్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో 2018 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 114, బిజెపికి 109 స్థానాలు వచ్చాయి. బిఎస్పీ 2, ఎస్పీ 1, నలుగురు ఇండిపెండెంట్స్ గెలిచారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 116 మంది ఎమ్మెల్యేలు అవసరం. కాని కాంగ్రెస్, బిజెపిలకు ఎవ్వరికీ సరైనా మెజారిటీతో రాలేదు. కాని కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా ఏర్పడింది. కాంగ్రెస్‌కు బిఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్లు మద్దతు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018 డిసెంబర్ 17 కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే మరో కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్వోతి రాధిత్య సింథియా తన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను చీల్చీ 2020 మార్చి 11న బిజెపిలో చేరారు. దీంతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. దాదాపు 15 నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కమల్ నాథ్ తన పదవిని కోల్పోయారు. 2020 మార్చి 23 వరకు కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా ‌ఉన్నారు.‌ వెంటనే బిజెపి నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజే ఆయన అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో గెలిచారు. దానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ హాజరు కాలేదు. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, స్వతంత్ర నాయకుల ఎమ్మెల్యేలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన జ్వోతి రాధిత్య సింథియాను బిజెపి రాజ్యసభకు నామినేట్ చేసింది. అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చింది.

అయితే కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఏర్పడిన 22 ఖాళీలతో పాటు, మరో రెండు స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి.

మధ్యప్రదేశ్‌లో మొత్తం 24 ఎమ్మెల్యే స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలకు ప్రస్తుతం ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలే అధికారంలో ఎవరుండాలో నిర్ణయిస్తాయి. బిజెపి గెలుచుకుంటే…ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఒకవేళ కాంగ్రెస్ కాని ఆయా స్థానాలను గెలుచుకుంటే…శివరాజ్ సింగ్ పదవికి ముప్పు వస్తుంది. కాంగ్రెస్ తరపున కమల్ నాథ్ ముఖ్యమంత్రి అవుతారు. కనుక ఈ ఉప ఎన్నికలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఈ ఎన్నికలు శివరాజ్ సింగ్ చౌహాన్ వర్సెస్ కమల్ నాథ్ గా జరుగుతున్నాయి. ఉప ఎన్నికల్లో గెలుస్తామని, మళ్ళీ అధికారాన్ని చేపడతామని కమల్ నాథ్ చెబుతున్నప్పటికీ…అది అంత సులువు కాదు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బిజెపి, కాంగ్రెస్ రెండూ రాష్ట్రంలో ఉప ఎన్నికలకు వ్యూహాన్ని రూపొందించడం ప్రారంభించాయి.

బిఎస్పీతో కాంగ్రెస్ చర్చలు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) కూడా ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించిన తరువాత ఉప ఎన్నికలు మరింత వేడిని సృష్టించాయి. ఉప ఎన్నికల్లో బిఎస్పీ పోటీ చేయడం వల్ల తమ గెలుపు అవకాశాలకు నష్టం కలుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఉప ఎన్నికలలో పోటీ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకురావాలని బిఎస్పీ నేతలను కాంగ్రెస్ కోరుతుంది.

పిసిసి అధ్యక్షుడు కమల్ నాథ్ ఇప్పటికే బిఎస్పీ చీఫ్ మాయావతి మేనల్లుడు ఆకాష్‌ను కలిశారు. బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాష్ పార్టీలో‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టవద్దని బీఎస్పీ నాయకులను ఒప్పించడానికి కమల్ నాథ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు వెళ్లే 24 సీట్లలో 16 గ్వాలియర్-చంబల్ ప్రాంతానికి చెందినవి. బీఎస్పీ తన అభ్యర్థులను నిలబెట్టితే ఆ ప్రాంతంలో త్రిముఖ పోటీ ఉంటుంది.

బీఎస్పీతో సమన్వయం చేసుకుని రంగంలోకి దిగడానికి కమల్ నాథ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో కొన్ని స్థానాలపై బిఎస్పి ప్రభావం చూపుతుంది. కాంగ్రెస్, బిఎస్పీల మధ్య సమన్వయం బిజెపిని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు.

2018లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిఎస్పీ, కాంగ్రెస్ ఎన్నికల కూటమి గురించి పలు చర్చలు జరిగాయి. అయితే మాయావతి ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.‌అయినప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంలో విఫలమయ్యారని మాయవతి ఆరోపించారు. కాబట్టి కమల్ నాథ్ నేరుగా బిఎస్పీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు.

బిజెపి వ్యూహాత్మక చర్చలు బిజెపి ఎన్నికలకు సన్నద్ధమైంది. ఎన్నికల కోసం ఒక వ్యూహాన్ని రూపొందించడం గురించి ఎన్నికల ఆపరేషన్ కమిటీ, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చలు చేస్తున్నాయి. ఆయా సమావేశాల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు విడి శర్మ పాల్గొన్నారు. పార్టీ అసంతృప్త నాయకులు అనుప్ మిశ్రా, మాయ సింగ్, దీపక్ జోషి, గౌరి శంకర్ షెజ్వార్, లాల్ సింగ్ ఆర్య కూడా పాల్గొన్నారు. అయినప్పటికీ అసంతృప్తి నేతలు జైభన్ సింగ్ పవయ్య, రుస్తాం సింగ్ ఈ సమావేశాలకు దూరంగా ఉన్నారు. మరోవైపు ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజ్యసభ ఎన్నికలు కాగానే శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రి వర్గాన్ని కూడా విస్తరించనున్నారు.

వారి చేరిక కాంగ్రెస్‌కు ఊపునిస్తుందా..?

ఉప ఎన్నికలకు ముందు బిజెపి సీనియర్ నేత, మాజీ మంత్రి బలేండు శుక్లా, బిజెపి నేత, లోక్‌సభ మాజీ ఎంపి ప్రేమ్‌చంద్ బోరాసి కాంగ్రెస్‌లో చేరారు.‌ వీరి చేరిక రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ‌ఊపునిచ్చే అవకాశాలున్నాయి. మాజీ రాష్ట్ర మంత్రి శుక్లా గతంలో కాంగ్రెస్‌లో ఉండేవారు అయితే జ్యోతి రాదిత్య సింధియాతో నెలకొన్న విభేదాల కారణంగా 2009లో పార్టీకి రాజీనామా చేసి, బిజెపిలో చేరారు. బిజెపిలోకి సింధియా ప్రవేశించడంతో శుక్లాకు అసంతృప్తిగా ఉన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ నివాసంలో శుక్లాను కాంగ్రెస్ కండువా కప్పి తిరిగి పార్టీలోకి స్వాగతించారు. మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మాట్లాడుతూ శుక్లా పార్టీలోకి “తిరిగి రావడం” సానుకూలతను‌ ఇస్తుందన్నారు.

ఇటీవలి కాలంలో బిజెపి నుండి కాంగ్రెస్‌లో‌ చేరిన నేతల్లో శుక్లా రెండో నేత. అంతకు ముందు మే 31న లోక్‌సభ మాజీ ఎంపి ప్రేమ్‌చంద్ బోరాసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కూడా జ్వోతి రాధిత్య సింధియా బిజెపిలో చేరడంతోనే తాను బిజెపిని వీడినట్లు తెలిపారు. వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ శుక్లాను అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నాయి. గ్వాలియర్ చుట్టు పక్కల సీట్ల నుండి శుక్లా ఎప్పుడూ పోటీ‌ చేసేవారు.