iDreamPost
iDreamPost
ఇన్నాళ్లూ జనసేనకు అక్కర్లేకుండా పోయిన విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి ఇప్పుడు ఆ పార్టీ మద్దతు ఇస్తుందట. ఉద్యమంలో తమ పార్టీ చురుగ్గా పాల్గొంటుందని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. ఎనిమిది నెలలుగా ఉద్యమం జరుగుతున్నా జనసేన స్థానిక నేతలు తప్ప పార్టీపరంగా గానీ, అగ్రనేతలు గానీ అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొననూ లేదు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందన్న చర్చ జరుగుతోంది. గత రెండేళ్లుగా బీజేపీతో పొత్తులో ఉన్నందునే జనసేన ఉక్కు ఉద్యమానికి దూరంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. బీజేపీని కాదని తాజాగా మద్దతు ప్రకటించిందంటే.. కమలంతో చెలిమికి సెలవు చెప్పడానికి సిద్ధమైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
జనసేనాని వస్తారట..
విశాఖ పర్యటనకు వచ్చిన జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఉక్కు పరిరక్షణ ఉద్యమ ప్రతినిధులను కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలుగు ప్రజలు త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ తో కోట్లాది తెలుగువారి భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయని చెప్పుకొచ్చారు. అటువంటి కర్మాగారాన్ని నష్టాల సాకుతో అమ్మేయాలనుకోవడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి జనసేన మద్దుతుగా నిలుస్తుందన్నారు. త్వరలోనే పార్టీ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చి ఉద్యమంలో స్వయంగా పాల్గొంటారని చెప్పారు.
నాదెండ్ల ప్రకటన ప్రకారం నిజంగా జనసేన ఉద్యమంలోకి వస్తే అది దాని మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి మింగుడుపడని వ్యవహారమే. కేంద్రంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకొని.. దాని అమలుకు చకచకా చర్యలు తీసుకుంటోంది. ఈ కారణంతోనే పవన్ కళ్యాణ్, జనసేన ఇన్నాళ్లూ ఉద్యమాన్ని ఉపేక్షిస్తూ వచ్చారు.
Also Read : కవరింగ్ టైం: బాబు వదిలేశాడు కాబట్టే ఆ పాప గెలిచిందంట …!
ఉద్యమం మొదలైన తొలినాళ్లలో పవన్ కళ్యాణ్ దీనిపై ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడం, ఢిల్లీలో తనకు పలుకుబడి ఉందని.. బీజేపీ అగ్రనేతలతో మాట్లాడి పరిష్కరించేస్తానని ప్రకటించి ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా వంటి కొందరు నేతలను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అక్కడ ఏం జరిగిందో గానీ ఆ తర్వాత నుంచి ఉక్కు ఉద్యమం ఊసెత్తలేదు.. అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఉద్యమంలోకి వస్తామని నాదెండ్ల ప్రకటించడంతో బీజేపీతో మైత్రి చేసిందన్న వాదనలు మొదలయ్యాయి.
పోసగని పొత్తు..
సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన జట్టు కట్టాయి. 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని, ఈ ఐదేళ్లు ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాలు చేస్తామని అప్పట్లో రెండు పార్టీలు ప్రకటించాయి. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు వారిని ఏ దశలోనూ కలిసి పనిచేయనివ్వలేదు. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా పోటీ చేస్తామని ప్రకటించడం జనసేనానిని అసంతృప్తికి గురి చేసింది.
అయితే బీజేపీ ఢిల్లీ పెద్దల ఒత్తిడితో ఆ రెండు ఎన్నికల్లో బీజేపీకి పవన్ మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత కూడా బీజేపీ నేతలు జనసేనను పట్టించుకోవడం మానేశారు. దాంతో ఉమ్మడి పోరాటాలు చేయాలన్న నిర్ణయం మరుగున పడిపోయింది. కొన్నాళ్లుగా రెండు పార్టీలు ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీల పొత్తు ఎన్నాళ్లో కొనసాగదని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో బీజేపీకి ఇబ్బంది కలిగించేలా విశాఖ ఉక్కు ఉద్యమంలో జనసేన పాల్గొంటే రెండు పార్టీల మధ్య పొత్తు పెటాకులు కావడం తథ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read : రెండు జిల్లాల పార్టీగా మిగిలిన జనసేన, అక్కడ కూడా అంతంతమాత్రమే