Idream media
Idream media
తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన నర్సింగ్ రావు చిరుద్యోగం చేస్తూ ఉన్నదాంట్లో కుటుంబాన్ని సంతోషంగానే చూసుకుంటున్నాడు. భార్య పుష్ప కూడా ఓ ఆఫీసులో అటెండర్ గా పని చేస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు. కూతురు నివేదిత (11), కొడుకు ప్రణీత (9). హాయిగా సాగిపోతున్న ఆ సంసారంలో కరోనా చిచ్చు పెట్టింది.
నర్సింగ్ రావు మహమ్మారి బారిన పడి ఆస్పత్రిలో చేరాడు. రోజూ ఆస్పత్రికి వెళ్లి వస్తూ పాపం పుష్ప కూడా కరోనాకు చిక్కింది. దురదృష్టవశాత్తూ పరిస్థితి విషమించి ముందుగా పుష్ప మరణించింది. రెండు రోజుల తర్వాత నర్సింగ్ రావు కూడా మృతి చెందారు. ఆ పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బంధువుల ఆదరణ ఉన్నా భవిష్యత్ అంధకారంగా మారింది. జీవితాంతం వారి బాధ్యత ఎలా అన్నది బంధువులకు కూడా దిక్కుతోచని స్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్ ప్రకటించిన సాయం వారికి కొండంత భరోసా ఇచ్చింది. వారి పేరున రూ 10 లక్షలు డిపాజిట్ చేయడంతో వారి భవితకు బాటలు వేశారు సీఎం జగన్.
కరోనా మహమ్మారి పలువురి చిన్నారులను అనాథలను చేసింది. అమ్మా, నాన్నలతో సంతోషంగా గడిపిన ఆ చిన్నారులకు వారిని దూరం చేసింది. ఎటుచూసినా అంధకారం. భవిష్యత్ పై గుబులు… ఇటువంటి క్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కాస్తయినా ఓదార్పు ఇస్తోంది. ఆర్థికంగా వారికి కొండంత ఇస్తోంది. జగన్ చర్యలను ఆ పిల్లల బంధువులు అభినందిస్తున్నారు. వారి చదువుకు, భవితకు జగన్ అందించిన సాయం ఎంతో దోహదపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఎన్నో రాష్ట్రాలు జగన్ బాటలోనే నడుస్తున్నాయి. తాజాగా తమిళనాడు కూడా కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ. 5 లక్షల సాయం ప్రకటించింది.
దయాదాక్షిణ్యం లేని వైరస్ చేతికి చిక్కి ఒంటరైన బతుకులను అక్కున చేర్చుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కలలను కబళించి కన్నవారిని కోల్పోయిన ఆ పసి హృదయాలను ప్రేమగా చేరదీసింది. వారెప్పటికీ అనాథలు కాకూడదంటూ ఆర్థిక భరోసాతో ఆ ఆరిపోయే బతుకుల్లో ఓ ఆశా దీపం నింపారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నో జీవితాలకు కొత్త ఆశలు చిగురించేలా చేసి భవిష్యత్కు ఓ భరోసా ఇస్తోంది. ఆపత్కాలంలో రాజకీయాలు మాని జగన్ తీసుకుంటున్న చర్యలకు ప్రశంసలు అందుతున్నాయి.
ఓ కుటుంబాన్ని కరోనా కబళించేసింది. ఏకంగా ఆ కుటుంబంలోని ముగ్గురు కరోనాకు బలవడం.. ఆ ఇంట్లోని ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తోంది. అమ్మ, నాన్న, నాయనమ్మను కోల్పోయిన ఆ పసిహృదయాల వేదన మనస్సును కలచివేస్తోంది. జే.పంగులూరు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన బద్రి శ్రీనివాసరావు తన భార్య స్వరాజ్యలక్ష్మి, తల్లి భాగ్యలక్ష్మి, ఇద్దరు పిల్లలు శేషసాయికుమార్, అరవింద్తో ఏ చీకూచింతా లేకుండా జీవిస్తున్నాడు. అయితే ఏప్రిల్ 23వ తేదీన బద్రి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంతో వాళ్ల అమ్మకి, భార్య, పెద్దబ్బాయి శేషసాయికి పాజిటివ్గా తేలింది. దీంతో నలుగురు ఒంగోలు రిమ్స్లో చికిత్స నిమిత్తం చేరారు.
ఏప్రిల్ 23వ తేదీన ఆస్పత్రిలో చేరిన శ్రీనివాసరావు చికిత్స పొందుతూ మూడు రోజుల్లోనే మృతిచెందాడు. ఆయన చనిపోయిన నాలుగు రోజులకు తల్లి భాగ్యలక్ష్మి చనిపోయింది. శ్రీనివాసరావు చనిపోయిన పదిహేను రోజులకు ఆయన భార్య స్వరాజ్యలక్ష్మి కూడా కరోనాకు బలైంది. నెలరోజుల్లోనే వీరు ముగ్గురూ మరణించడంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. తల్లిదండ్రులను తమ చేత్తోనే ఖననం చేసి వారి జ్ఞాపకాలతో ఇంటికి చేరిన ఆ పసిహృదయాలను ఓదార్చే వారే కరువయ్యారు. కరోనా భయంతో ఎవ్వరూ దగ్గరకు రాలేదు.. కనీసం పలకరింపులు కూడా దూరమయ్యాయి. ఆ సమయంలో సీఎం జగన్ అభయంతో వారిలో కొత్త ఆశలు చిగురించాయి. వారి భవిష్యత్కు పునాదులు పడ్డాయి. పిల్లల్లో పెద్దవాడైన శేషసాయికుమార్ ఇటీవల పదో తరగతి పూర్తి చేసేకోగా, చిన్నబ్బాయి అరవింద్ ఎనిమిదో తరగతి పూర్తి చేసుకున్నాడు. ఇలా ఎందరికో ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.