జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు ఓ బిజినెస్ మేన్.. ఆయనకు తెలివితేటలు మెండుగా ఉన్నాయని అనేక సందర్భాల్లో రుజువైంది కూడా.. రాజకీయంగా అనేక వ్యూహాలను చేధించుకున్న ఆయన తన వ్యూహాలతో ప్రత్యర్ధి పార్టీలకు మట్టి కరిపించారనడంలో సందేహం లేదు. ఇప్పుడు అదే స్ట్రాటజీని పరిపాలనలోనూ చూపిస్తున్నారు జగన్. రివర్స్ టెండరింగ్, అవినీతి రహిత పాలన, ఆడంబరాలకు దూరంగా ఉండడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ కు ఆంధ్రప్రదేశ్ లో “మీ బ్యాంక్” పెట్టాలనే ఆలోచన వచ్చిందట. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక ఇబ్బందే దానికి కారణమని తెలుస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులందరికీ నెలనెలా జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు, రుణాలు అన్నీ కలుపి దాదాపుగా రూ.5,500 వేల కోట్లు అవుతోంది. ఈ డబ్బును చెల్లించడానికి ప్రభుత్వం ముందుగా ట్రెజరీకి నిధులు బదిలీ చేస్తుంది. ఆతర్వాత అది ప్రభుత్వరంగ బ్యాంకులైన ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఉద్యోగుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఈ విధానం కొనసాగుతుండగా జగన్ సర్కార్ దీనికి స్వస్తి పలికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మనమే ఓ బ్యాంకు ఏర్పాటుచేయాలని చూస్తోందట.. దానిపేరే మీ బ్యాంక్.. సాధారణంగా ఉద్యోగులు తమ అవసరాలమేరకే డబ్బు డ్రా చేస్తారు.. అంతేకానీ జీతం మొత్తం ఒకేసారి విత్ డ్రా చేయరు.. అయితే ఇతర బ్యాంకులనుంచి జీతాలు ఇవ్వడం వల్ల అది ప్రభుత్వ పరిధిలోకి రాదు కాబట్టి.. ప్రభుత్వం తరపునే ప్రత్యేకంగా బ్యాంకు ఉంటే ఉద్యోగులు తమ అవసరాలకు విత్ డ్రా చేసిన డబ్బు కాకుండా మిగిలి ఉన్న మొత్తం ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ఈ లాజిక్ ప్రధానంగా మీ బ్యాంక్ ఏర్పాటు ఏర్పాటుకు ఆలోచనగా తెలుస్తోంది.
మీ బ్యాంక్ అందుబాటులోకి వస్తే ప్రభుత్వ ఖజానా ఖాళీ కాదు.. అలాగే లబ్దిదారులకు చెల్లించాల్సిన సొమ్ము కూడా చెల్లించినట్లు ఉంటుందట.. ‘గ్రీన్ ఛానల్ పీడీ’ ఖాతా తరహాలో ‘మీ బ్యాంక్’ కూడా ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ ఆలోచిస్తోందట. ఉద్యోగుల వేతనాలు, సంక్షేమ పధకాల అమలు, పెన్షన్లు అన్నీ ఈ బ్యాంక్ ద్వారానే లబ్దిదారులకు చెల్లిస్తారట. అలాగే లబ్ధిదారులు ఒకేసారి మొత్తం సొమ్మును విత్ డ్రా చేసుకోకుండా పరిమితులు కూడా విధించనున్నారని సమాచారం. ప్రస్తుతం కేరళ ట్రెజరీ బ్యాంక్ తరహాలోనే మీ బ్యాంక్ ఏర్పాటు కానుందని, పనితీరు కూడా బావుంటుందని వినికిడి. ఏదేమైనా జగన్ యువ ముఖ్యమంత్రిగా ఇప్పటికే పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు తన మార్క్ పాలనతో మీ బ్యాంకుకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది.