Idream media
Idream media
కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులపై లొల్లి కొనసాగుతూనే ఉంది. కొన్ని రాష్ట్రాలలో రైతుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. దానికనుగుణంగా కొన్ని రాష్ట్రాలు రైతులకే మద్దతు పలుకుతున్నాయి. ఈ బిల్లుకు సంబంధించి కొంత మిత్రపక్షం కూడా విపక్షంగా వ్యవహరిస్తోంది. అయినప్పటికీ లోక్ సభలో బీజేపీకి ఉన్న మెజార్టీతో వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించిన ఆ మూడు బిల్లులు ఎలాంటి అవాంతరాలు లేకుండా లోక్సభలో ఆమోదం పొందాయి. ఈ బిల్లులు నేడు రాజ్యసభకు రానున్నాయి. ఓటింగ్ ప్రక్రియ జరుగనుంది. లోక్ సభలో సునాయాసంగా గట్టెక్కిన అధికార పక్షానికి ఇక్కడ కొంత ఇబ్బందులు ఎదురవ్వక తప్పేలా లేదు. రాజ్యసభలో బిల్లు ఆమోదింపచేసుకోవడం కోసం అధికార పార్టీకి అంత సులవైన అంశంలా లేదు. ఇప్పటికే మిత్రపక్షం శివసేనతో పాటు.. శిరోమణీ అకాలీదళ్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయనుంది.
వ్యతిరేకంగా ఓటేయ్యండి : కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్రం తెస్తున్న నూతన వ్యవసాయ బిల్లులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ ఎంపీలను ఆయన శనివారం ఆదేశించారు. బిల్లును అడ్డుకునేందుకు శాయశక్తులా కృషి చేయాలని చెప్పారు. నూతన వ్యవసాయ బిల్లు తేనేపూసిన కత్తి లాంటిదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతులకు నష్టం చేకూర్చి, కార్పొరేట్ శక్తులు లాభపడేలా బిల్లు ఉందని విమర్శించారు. వ్యవసాయ బిల్లును ముమ్మాటికీ వ్యతిరేకించి తీరుతామని స్పష్టం చేశారు.
‘పైకి మాత్రం రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఇది వ్యాపారులకే మేలు చేసేలా ఉంది. వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం ఇది. కార్పోరేట్ మార్కెట్ శక్తులు దేశమంతా విస్తరించడానికి, వారికి దారులు బార్లా తెరవడానికి ఉపయోగపడే బిల్లుగా ఉంది. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. తమకున్న కొద్దిపాటు సరుకును రైతులు ఎన్నో రవాణా ఖర్చులు భరించి, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మడం సాధ్యమవుతుందా? అని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటు వేయనున్నట్లు స్పష్టం అవుతోంది.
రాజ్యసభలో ఇదీ పరిస్థితి..
రాజ్యసభలో సభ్యుల సంఖ్య మొత్తం 245. అందులో ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 86 మంది సభ్యుల మద్దతు ఉంది. విపక్ష కాంగ్రెస్కు 40 మంది సభ్యులు ఉండగా.. మిగతా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే మిత్రపక్షాలతో కలుపుకుని తమకు 130 మంది సభ్యులు మద్దతు లభిస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అకలీదళ్ (3) వ్యతిరేకంగా ఓటు వేసినా.. మిగతా పార్టీల మద్దతును కూడగట్టుకుంటామని లెక్కలు చెబుతోంది. బీజేపీ భావిస్తున్నట్లు జేడీయూతో పాటు అన్నాడీఎంకే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోనే బీజూ జనతాదళ్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఓటింగ్పై స్పష్టత లేదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా టీఆర్ఎస్ బిల్లులకు అనుకూలంగా ఓటు వేసినా.. ఆప్, బీఎస్పీ, ఎస్పీ వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా పార్టీల మద్దతుపై బిల్లు భవితవ్యం ఆధారపడి ఉంది.
బీజేపీ ముమ్మర ప్రయత్నాలు
మరోవైపు బిల్లుకు వ్యతిరేకంగా పోరాడేందుకు విపక్ష కాంగ్రెస్ పార్టీల మద్దతును కూడగడుతోంది. రాజ్యసభలో బిల్లులను అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించిన రాహుల్ గాంధీ.. రైతులను పాండవులతో, ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కౌరవులతో పోలుస్తూ.. ఈ ధర్మ యుద్ధంలో ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఇతర రాజకీయ పార్టీలను కోరారు. ఇక బిల్లులపై దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆదివారం నాటి రాజ్యసభ సమావేశాలు రసవత్తరంగా జరుగనున్నాయి. రాజ్యసభ లో బిల్లులపై నేడు జరగబోయే కీలకమైన బిల్లును గట్టెక్కించేందుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయినప్పటికీ వ్యతిరేక గళాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో నేడు తేలిపోనుంది.