iDreamPost
iDreamPost
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మాగంటి రూప మళ్లీ పోటీ చేయరా? అన్న చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు అయిన రూప ఓటమి తర్వాత మళ్లీ నియోజవర్గానికి రావడం లేదు.
అప్పట్లో విస్తృతంగా పర్యటన..
గత ఎన్నికలకు ముందు తన మామ మురళీమోహన్ ప్రోత్సాహంతో నియోజకవర్గంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. 2014లో ఎంపీగా మురళీమోహన్ గెలిచాక కొన్నాళ్లకు యాక్సిడెంట్లో కాలు విరిగి ఢిల్లీలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అందువల్ల చాలాకాలం ఆయన నియోజకవర్గానికి రాలేదు. ఆ సమయంలో ఆయన తరఫున ఈమె నియోజకవర్గంలో పర్యటించి, ప్రజల సమస్యలకు సంబంధించి వినతులు స్వీకరించేవారు. అలా నియోజకవర్గంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు పరిచయం అయ్యారు. తర్వాత మురళీమోహన్ ఆరోగ్యం కుదుట పడి నియోజకవర్గానికి వచ్చినా ఆయనతో పాటు ఈమె కూడా సభలు, సమావేశాలకు హాజరయ్యేవారు. కొన్ని అధికార కార్యక్రమాల సందర్భంగా సభల్లో మురళీమోహన్తో పాటు ఈమె కూడా వేదికపై కూర్చోవడాన్ని అప్పట్లో ప్రత్యర్థులు తప్పు పట్టారు కూడా. అయినా ఆమె 2019 ఎన్నికల వరకూ నియోజకవర్గంలో తరచు పర్యటనలు చేసేవారు. రాజమహేంద్రవరం వెంకటేశ్వరనగర్లో సొంత ఇంటి నుంచి తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించేవారు.
ఓటమితో నిరాశ చెందారా!
2019 ఎన్నికల్లో మురళీమోహన్ తనకు బదులు తన కోడలికి రాజమహేంద్రవరం లోక్సభ స్థానానికి టికెట్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి సీటు సాధించారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన మార్గాని భరత్రామ్ 5,82,024 ఓట్లు సాధించారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన మాగంటి రూప 4,60,390 ఓట్లు తెచ్చుకున్నారు. జనసేన అభ్యర్థి ఆకుల సత్యనారాయణ 1,55,807 ఓట్లు సాధించారు. 1,21,634 ఓట్ల మెజార్టీతో మార్గాని భరత్రామ్ విజయం సాధించారు. భారీ తేడాతో ఓటమి చెందిన రూప తరువాత దాదాపు నియోజకవర్గానికి రాలేదు. రాజమహేంద్రవరంలోని ఇంటిని కూడా అమ్మేశారు. దీంతో ఓటమితో ఆమె నిరాశ చెందారా? మళ్లీ పోటీ చేయరా అన్న సందేహం అటు జనంలోనూ, పార్టీ నాయకుల్లోనూ నెలకొంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లో తమకున్న వ్యాపార వ్యవహారాల్లో నిమగ్నమయ్యారు.
Also Read : మీసాల రాజు గారు ఇప్పుడు ఏమి చేస్తున్నారు..?
గెలుపు అంత సులువు కాదు..
మురళీమోహన్ను కూడా పోటీ చేయగానే విజయం వరించలేదు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన తృటిలో ఆయన విజయాన్ని కోల్పోయారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఆరు చోట్ల ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్కుమార్పై పై చేయిగా నిలిచారు. అప్పుడు ఆయన గెలిచేశారనే అంతా అనుకున్నారు. అయితే చివరిలో అనపర్తి నియోజకవర్గం ఓట్లు లెక్కింపు పూర్తయ్యాక ఫలితం తిరగబడినట్టయింది. అక్కడ ఉండవల్లికి వచ్చిన మెజార్టీతో 2, 147 ఓట్ల తేడాతో మురళీమోహన్ ఓడిపోయారు. మూడోస్థానంలో నిలిచిన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి సినీనటుడు యు.కృష్ణంరాజు 2,53,437 ఓట్లు సాధించారు.
పట్టుదలగా పనిచేసి..
2009 ఎన్నికల్లో ఓటమిని పరిగణలోకి తీసుకుని మళ్లీసారి ఎలాగైనా గెలవాలనే పట్దుదలతో మురళీమోహన్ పనిచేశారు. నియోజకవర్గంలో అయిదేళ్లూ తరచు పర్యటించారు. జనం సమస్యలు ఆలకించారు. వారిలో దృష్టిలో పడ్డారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి 6,30,573 ఓట్లు సాధించారు. వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన బొడ్డు వెంకట రమణచౌదరి 4.63,139 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కందుల దుర్గేష్ 21,243 ఓట్లు సాధించారు. 1,67,434 ఓట్ల మెజార్టీతో మురళీమోహన్ గెలుపొందారు. ఓటమి తర్వాత కూడా ప్రజల్లో ఉండడం, పట్టుదలగా పనిచేయడం ఆయనను మంచి మెజార్టీతో గెలిపించాయి.
ఆసక్తి లేకనే..
ప్రస్తుతం మురళీమోహన్ వయసు 81 సంవత్సరాలు. గత ఎన్నికల్లోనే వయో భారంతో తాను పోటీ చేయకుండా కోడలిని బరిలోకి దింపారు. ఆమె భారీ తేడాతో ఓడిపోవడంతో ఇక రాజకీయాలకు దూరం జరగాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, తన కుటుంబ సభ్యులు కూడా ఎవరూ ఇకపై రాజకీయాల జోలికి రారని ఆయన ఒకటి, రెండు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మాగంటి రూప పోటీ చేయరని భావిస్తున్నారు. ఆర్థికంగా బలమైన మురళీమోహన్ కుటుంబం పోటీ చేయదని తేలిపోవడంతో మరో బలమైన నేతను చూసుకోవాలని పార్టీ నేతలు అనుకుంటున్నారు.
Also Read : Pamula Rajeswari – కుమారుడు భవిష్యత్ కోసం మహిళా మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా..?