ఆయన వెళ్లిపోవడమే మంచిది అన్నట్లుగా సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి విషయంలో అధినేత చంద్రబాబునాయుడు వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన బాటలో మరికొందరు సీనియర్లు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు బాబుకు అందినట్లు తెలిసింది. దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన బాబు తన అనుచరుల ద్వారా బుచ్చయ్యను సమయం కోరారు. ఓ పది రోజులు టైమ్ ఇస్తే అన్నీ సెట్ చేస్తానని మాటిచ్చారట. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి బుచ్చయ్య కొన్ని డిమాండ్లు చేసినట్టు తెలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, పార్టీలో క్రియాశీలక పదవుల విషయంలో బుచ్చయ్య పట్టుబట్టినట్టు తెలుస్తోంది. అనుకున్నట్లుగానే బుచ్చయ్యే చంద్రబాబుపై పైచేయి సాధించినట్లు ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచీ.. పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించేందుకు మొదట్లో బాబు పెద్దగా దృష్టి పెట్టలేదు. నిజానికి బాబుకున్న అతి పెద్ద బలహీనతల్లో ఇదొకటిగా అభివర్ణిస్తారు. ఇది ఆయన్ను తరచూ ఇబ్బంది పెడుతున్నా.. దీన్ని అధిగమించే విషయంపై ఆయన ఎప్పుడూ ఫోకస్ పెట్టరన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది. దీంతో ప్రముఖ నేతలందరూ ఇతర పార్టీల బాట పట్టారు. దీనికితోడు ప్రజల్లో కూడా పార్టీకి ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఇంతకు మునుపులానే వ్యవహారం ఉంటే పార్టీ గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయని పసిగట్టిన బాబు ఇటీవలి కాలంలో అసంతృప్త నేతలపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఏళ్లకు ఏళ్లు చూసినా బాబులో మార్పు రాని నేపథ్యంలో తమకు తామే మారిపోవాలన్నట్లుగా ఉన్న నేతలతో తరచూ మాట్లాడుతున్నారు. ఇలా ఉండగానే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలకబూనటం.. అవసరమైతే పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటానికి సైతం సిద్ధమన్న సిగ్నల్ ఇవ్వటం తెలిసిందే.
Also Read:ఎన్నికలు జరిగే ఆ ఐదు రాష్టాలలో నాలుగు బీజేపీకేనట..!
బుచ్చయ్య విషయంలో కూడా బాబు మొదట్లో ఆలస్యం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఒక టీంను ఆయన ఇంటికి పంపటం.. అలకను తీర్చే బాధ్యతను వారి మీద పెట్టటం తెలిసిందే. అయితే.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెల్లువెత్తాయి. ఇక.. ఊహాగానాలకు అయితే.. కళ్లాలు తెగిన గుర్రాల మాదిరి పరుగులు తీశాయి. అయితే.. సీనియర్ నేత కావటంతో గోరంట్ల కాస్తంత సంయమనం వహించటంతో పార్టీకి.. అధినేత బాబుకు భారీగా డ్యామేజ్ జరగలేదని చెప్పాలి.
గతంలోనే గోరంట్ల ఇంటికి వెళ్లిన పార్టీ నేతలు.. ఆయన డిమాండ్లకు ఓకే చెప్పారు. అయినప్పటికీ అధినేత హామీ కోరారట. ఆ మేరకు తాజాగా బాబు – గోరంట్ల భేటీ సాగినట్లు పలువురు చెబుతున్నారు. తమ భేటీలో గోరంట్ల చెప్పిన విషయాల్ని చంద్రబాబు సావధానంగా విన్నట్లు చెబుతారు. ఇక.. ఆయన డిమాండ్ల విషయానికి వస్తే.. త్వరలో పయ్యావుల కేశవ్ కు అప్పజెప్పిన పీఏసీ ఛైర్మన్ పదవిని తాను ఆశిస్తున్నట్లుగా గోరంట్ల చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. త్వరలో జరిగే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ.. ఇతర వ్యవహారాల్లోనూ తన మాట చెల్లుబాటు అయ్యేలా హామీ ఇవ్వాలని ఆయన కోరగా.. అందుకు తాను సానుకూలంగా ఉన్నట్లు చంద్రబాబు సంకేతాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే బుచ్చయ్య టీడీపీ వీడే ఆలోచనను విరమించుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
Also Read: వరదాపురం సూరి మళ్లీ టీడీపీలోకి?పరిటాల కుటుంబం ఒప్పుకుంటుందా?