iDreamPost
android-app
ios-app

Gulam nabi azad – కాశ్మీర్‌లో కొత్త పార్టీ? సొంతపార్టీ పెట్టనున్న గులాం నబీ ఆజాద్ ?

  • Published Dec 05, 2021 | 9:05 AM Updated Updated Mar 11, 2022 | 10:32 PM
Gulam nabi azad – కాశ్మీర్‌లో కొత్త పార్టీ?  సొంతపార్టీ పెట్టనున్న  గులాం నబీ ఆజాద్ ?

జాతీయస్థాయిలో పూర్వ వైభవం కోసం అపసోపాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీని నాయకుల వలసలు, అంతర్గతంగా నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తి మరింత దిగజారుస్తున్నాయి. కేంద్రంతోపాటు మెజారిటీ రాష్ట్రాల్లో అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీకి జమ్మూకాశ్మీర్‌లో కూడా త్వరలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా అసంతృప్తి స్వరం వినిపిస్తున్న అత్యంత సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి గులాంనబీ ఆజాద్ కాశ్మీర్‌లో కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆయన తోసిపుచ్చినా.. ఆయన కదలికలు, వ్యాఖ్యలు ఆ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. అదే జరిగితే సరిహద్దు రాష్ట్రంలో కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బ తినడం ఖాయం.

నాయకత్వంపై విసుర్లు

కాంగ్రెస్ అధిష్టానాన్ని.. గాంధీ కుటుంబాన్ని గత ఏడాదిన్నర కాలంగా టార్గెట్ చేసిన గ్రూప్ 23 నేతల్లో ఒకరైన ఆజాద్ కొద్ది రోజులుగా అసమ్మతి స్వరం పెంచారు. పదునైన వ్యాఖ్యలతో అధిష్టానాన్ని ఇరుకున పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 300 స్థానాలు సాధించి మళ్లీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం, ఆశ తనకు లేవని ఇటీవలే ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తాజాగా కాశ్మీర్‌లోని రాంబన్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఇందిర, రాజీవ్ హయాంలో ప్రశ్నించే స్వేచ్ఛ ఉండేదన్నారు. వారిద్దరూ విమర్శలను స్వీకరించేవారని, తప్పులపై ప్రశ్నించే అవకాశం ఇచ్చేవారని చెప్పారు. కానీ ప్రస్తుత నాయకత్వం విమర్శలను సహించడం లేదన్నారు. తరచూ ఆజాద్ చేస్తున్న విమర్శలు అధిష్టానానికి ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. అయితే పార్టీలో అత్యంత సీనియర్ నేత కావడంతో పిలిచి హెచ్చరించేందుకు వెనుకాడుతున్నారు.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం

పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ ఆ ఆలోచన లేదని అన్న ఆజాద్.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని వ్యాఖ్యానించడం విశేషం. మరోవైపు కొద్దిరోజులుగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.అజాద్‌కు విధేయులైన 20 మంది నేతలు ఇటీవలే కాంగ్రెస్ పదవులకు రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుందామని అనుకున్నా.. వేలాది మద్దతుదారుల కోసం ఆ ఆలోచన విరమించుకుని కొనసాగుతున్నానని చెబుతున్న ఆజాద్ 2005లో కాశ్మీర్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలోని పలు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన ఆయన వ్యాఖ్యలు, వేస్తున్న అడుగులు త్వరలో కొత్త పార్టీ పెట్టడమో..వేరే పార్టీలో చేరడమో తప్పదన్న సంకేతాలు పంపుతున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.