Idream media
Idream media
మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికతో తెలంగాణ బీజేపీ బలోపేతమైందని ఓ వర్గం సంతోషిస్తుంటే, ఆయన రాకతో మొదలైన గ్రూపు తగాదాలు నష్టం కలిగించేలా ఉన్నాయని మరో వర్గం ఆందోళన చెందుతోంది. బయటకు అంతా సవ్యంగా ఉన్నట్లే కనిపిస్తున్నా, అంతర్గతంగా నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు సమావేశాల సందర్భంగా బయటపడుతోంది. పార్టీ కార్యక్రమాల్లో కలిసినప్పుడు సీనియర్లు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఈటల కాషాయ కండువా కప్పుకోవడానికి ముందు తర్వాత జరిగిన పరిణామాలతో కొందరు నాయకుల మధ్య దూరం పెరిగినట్లు పార్టీ వర్గాల్లో టాక్. ఈటల తనవల్లే పార్టీలో చేరారు అనే క్రెడిట్ ఫైట్ కోసం నాయకులు పాకులాడటంపై బీజేపీలో చర్చనీయాంశంగా మారుతోంది.
ఈటల రాకతో బీజేపీ బలోపేతమైందని భావిస్తున్న వర్గంలో కొందరు నాయకులు అది తన వల్లే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రధానంగా ఓ నాయకుడు చాలా ఎక్కువ హడావిడి చేశారని.. అంత అవసరం లేదని పార్టీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అర్థ, అంగ బలం ఉన్నవారు యాక్టివ్గా పనిచేస్తే తప్పేంటని.. దానివల్ల బీజేపీకి లాభమే కానీ నష్టం జరగదు కదా అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారట. మొత్తానికి ఈటల బీజేపీలో చేరిపోవడం.. ఆయన హుజురాబాద్ ఉపఎన్నికపై ఫోకస్పెట్టి క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నా.. నాయకులు వ్యవహరించిన తీరుపై చర్చ మాత్రం ఆగడం లేదట. తెర వెనక జరిగిన పరిణామాలపై తెగ చెవులు కొరుక్కుంటున్నారు. కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. బయటకు ఎవరూ కామెంట్ చేయకపోయినా.. పార్టీ అంతర్గత చర్చల్లో మాత్రం హాట్హాట్గానే మాటలు పేలుతున్నాయట
తెలంగాణ బీజేపీలో గ్రూప్ల గోల ఇప్పటిది కాదు. పేరున్న నాయకులకు ఎప్పుడూ ప్రత్యేకంగా ఒక వర్గం ఉంటూ వస్తోందట. ఎవరు కీలక పదవుల్లో ఉంటే వారి వర్గాలకు.. అనుయాయులకు పదవులు దక్కుతుంటాయని చెబుతారు. ఈ ఆధిపత్య పోరు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లిందని టాక్. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా వాటికి భిన్నంగా ఏవీ లేవన్నది కొందరి వాదన. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అది కొందరికి నచ్చడం లేదట. ఆయనకు చెక్ పెట్టేందుకే హుజురాబాద్ ఉపఎన్నికలో వివేక్కు నచ్చని వారికి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ పేరును ప్రస్తావిస్తున్నారు. వివేక్, చంద్రశేఖర్లకు పడదని.. అది దృష్టిలో పెట్టుకునే పార్టీలో కొందరు పావులు కదిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీజేపీ సర్కిళ్లలోని సోషల్ మీడియాలో ప్రస్తుతం వివేక్, చంద్రశేఖర్ అంశాలపైనే పోస్టులు ట్రోల్ అవుతున్నాయి. ఈ ఎత్తుగడ వెనక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారా లేక ఇంకెవరైనా మంత్రాంగం చేశారా అన్నది కొందరు ఆరా తీస్తున్నారట. ఈ పరిణామాల మధ్య హుజురాబాద్ ఉపఎన్నికలో మాజీ ఎంపీ వివేక్ ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే హుజురాబాద్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి వైఖరి ఏంటో పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఇటు చూస్తే కొత్త ఎత్తుగడలు కేడర్ను ఠారెత్తిస్తున్నాయి. ఈ వివాదాలు, చర్చలు ఎటు దారి తీస్తాయో చూడాలి.
Also Read : లొల్లి మీద లొల్లి.. చివరకు టీపీసీసీ మహిళా కాంగ్రెస్ చీఫ్ ఫైనల్