iDreamPost
iDreamPost
గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. వరద నిలకడగానే సాగుతోంది. దీంతో నీటి మట్టలు దిగువకు చేరతాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఆదివారం ఉదయం 11 గంటలకు ఉపసంహరించారు.
గోదావరి ప్రవాహం ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 17.60 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. దీంతో గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని వచ్చింది వచ్చినట్లుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి 18 లక్షల 84 వేల 238 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే డెల్టా కాలువలకు 10,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు 3,800, మధ్యమ డెల్టాకు 2,600, పశ్చిమ డెల్టా కాలువకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న ట్లు అధికారులు వెల్లడించారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం వద్ద 46.80 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరద ఉధృతి క్రమంగా తగ్గి పోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ధవళేశ్వరం నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.