iDreamPost
iDreamPost
గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను మద్దతు ధరకే కొనుగోలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) వారికి చేయూతను అందిస్తోంది. దీంతో అడవినే నమ్ముకొని జీవించే గిరిజనులు అటవీ సంపదతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. అడవిలో సహజ సిద్ధంగా లభించే ఉత్పత్తుల ఆధారంగా కుటుంబాలను పోషించుకుంటున్నారు. గిరిజనులు వారు నివసించే ప్రాంతంలోనే ఎంతో ప్రయాసతో అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు. అలా సేకరించిన వాటిలో కొన్ని వారి సొంతానికి వినియోగించుకుంటారు. మరి కొన్నింటిని విక్రయించడం ద్వారా ఆదాయం పొంది కుటుంబాలను పోషించుకుంటారు. వీరు సేకరించే ఉత్పత్తులకు మద్దతు ధర ఇచ్చి జీసీసీ వారికి అండగా నిలుస్తోంది.
మార్కెట్లో డిమాండు..
గిరిజనుల నుంచి సేకరించే అటవీ ఉత్పత్తులను జీసీసీ ప్రాసెస్ చేసి విక్రయిస్తుంది. వీటికి బయట మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. రాను రాను వీటికి డిమాండు పెరుగుతోంది. దీంతో అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. ఆ మేరకు గిరిజనుల నుంచి జీసీసీ ఎక్కువగా అటవీ ఉత్పత్తులను సేకరిస్తోంది.
బహుముఖ ప్రయోజనాలు..
గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తుల్లో రోజువారీ మనం ఆహారంగా వినియోగించేవి కొన్ని, గృహ అవసరాలకు ఉపయోగించేవి కొన్ని ఉన్నాయి. మరికొన్ని ఉత్పత్తులు ఆయుర్వేద, అల్లోపతి మందులు, సౌందర్య సాధనాల తయారీలో వినియోగిస్తారు. కరోనా కష్టకాలంలో కూడా జీసీసీ గిరిజనులకు అండగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలను అమలు చేసి అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఈ విధంగా 24 రకాల ఉత్పత్తులను వారి నుంచి సేకరిస్తోంది. చింతపండు, విప్పపలుకు, గానుగ పప్పు, కోవెల చెట్టు జిగురు, పుట్ట తేనె, కరక్కాయ, నల్లజీడి పిక్కలు వంటివి ఇందులో ఉంటాయి.
ఏటా సేకరణ వ్యయం పెంచుతున్న జీసీసీ..
అటవీ ఉత్పత్తుల సేకరణకు అయ్యే వ్యయాన్ని జీసీసీ ప్రతి సంవత్సరం పెంచుతోంది. 2019-2020లో ఇందుకు రూ.13.18 కోట్లు ఖర్చు చేయగా 2020-2021లో రూ.76.37 కోట్లు ఖర్చు చేయడం ఒక రికార్డు. అమ్మకాలు 2019-2020లో రూ.24.22 కోట్ల మేర జరగ్గా, 2020-2021లో రూ.33.07 కోట్లకు పెరగడం విశేషం. జీసీసీ తీసుకుంటున్న చొరవ గిరిజనులకు ఆర్థికంగా చేయూతనివ్వడమే కాక వారిలో ఆత్మ స్థైర్యం నింపుతున్నాయి.