iDreamPost
android-app
ios-app

కొవిడ్ పై ఫైట్.. ఏపీ ట్రిఫుల్ ఫోర్స్..!

కొవిడ్ పై ఫైట్.. ఏపీ ట్రిఫుల్ ఫోర్స్..!

క‌రోనాపై పై చేయి సాధించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రోజురోజుకూ వైర‌స్ క‌ట్ట‌డికి ప‌ట్టు బిగిస్తోంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రోజూ స‌మీక్ష‌లు నిర్వహిస్తూనే ఉన్నారు. జిల్లాల వారీగా ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ప‌రీక్ష‌లు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో ముందంజ‌లో ఉన్న ఏపీ మ‌రింత క‌ట్ట‌డి దిశ‌గా కొత్త కొత్త చ‌ర్య‌లు చేప‌డుతోంది. కరోనా తీవ్రత దృష్ట్యా జిమ్‌లు, స్టేడియాలు, స్విమ్మింగ్‌పూల్స్‌ మూసివేయమని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం.. నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌కు రాష్ట్ర‌స్థాయి నుంచి జిల్లా స్థాయి వ‌ర‌కు ప్ర‌త్యేకంగా క‌మిటీల‌ను, స్క్వాడ్ ల‌ను ఏర్పాటు చేస్తోంది. కోవిడ్‌ పరిస్థితులపై అధికారులతో తాజాగా జ‌రిపిన‌ స‌మీక్షలో సీఎం వైఎస్ జ‌గ‌న్.. కోవిడ్‌–19 కంటైన్మెంట్‌ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మూడంచెల వ్య‌వ‌స్థ‌

ఇప్ప‌టికే ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్ మెంట్ అనే మూడు ప‌ద్ధ‌తుల్లో ముందుకెళ్తున్న ఏపీ.. వాటి అమ‌లు క్షేత్ర‌స్థాయిలో ఎలా ఉందో ప‌రీక్షించేందుకు కొవిడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేయాల‌ని తాజాగా నిర్ణ‌యించింది. నిరంతర పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేయాల‌ని, జిల్లా స్థాయిలో ఫ్లైయింగ్‌ స్క్వాడ్ ఉండాల‌ని, కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇవ్వాల‌ని భావిస్తోంది. జాయింట్‌ కలెక్టర్‌ (డెవలప్‌మెంట్‌)కు కోవిడ్‌–19పై పూర్తి బాధ్యతలు అప్ప‌గిస్తున్న‌ట్టు సీఎం జ‌గ‌న్ తెలిపారు. కొవిడ్ కట్టడికి క్లస్టర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన సీఎం. జిల్లాలో కొవిడ్ కు చికిత్స అందించే ఆస్పత్రులన్నింటినీ క్ల‌స్టర్లుగా విభ‌జించారు. ప్రతి క్లస్టర్‌లో 5 నుంచి 8 ఆస్పత్రులు ఉండ‌గా ఒక్కో క్లస్టర్‌కు జిల్లా స్థాయి అధికారి ఇంఛార్జ్‌గా నియ‌మించారు..అనుమతి లేని ఆస్ప‌త్రుల్లో చికిత్స, ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో అధిక వసూళ్లు, క్షేత్ర స్థాయి ఫిర్యాదుల పరిష్కారం బాధ్యతలను చూడ‌నున్నారు క్లస్టర్ ఇంఛార్జ్‌లు..‍‍‍‍‍‍‍

అధిక ఫీజులపై ఫ్ల‌యింగ్ స్క్వాడ్

ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో అధిక ఫీజులపై ప్రభుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నుంది. ఫీజుల కట్టడికి జిల్లా స్థాయిలో ఫ్ల‌యింగ్‌ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన స‌ర్కార్. ఆ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేసే స్వేచ్ఛ జిల్లా కలెక్టర్ల‌కు అప్ప‌గించింది. ముగ్గురు సభ్యులతో ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ టీం ఉండాల‌ని.. సభ్యులుగా డ్రగ్ కంట్రోల్ అధికారి, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నుంచి ఒకరు, వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక అధికారి ఉండాల‌ని.. వెంటనే ఆస్పత్రుల క్లస్టర్లు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఉండ‌నుండ‌గా.. జిల్లాల క్లస్టర్లు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ల పనితీరును సమీక్షించడం కోసం రాష్ట్ర స్థాయిలో సీనియర్‌ అధికారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు.. ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో సభ్యులుగా రాష్ట్ర కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఔషథ నియంత్రణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ రవిశంకర్‌ను నియ‌మించారు.

ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు వినూత్న విధానాలు, చ‌ర్య‌ల ద్వారా కొవిడ్ క‌ట్ట‌డిపై ఏపీ ప్ర‌భుత్వం అత్య‌ధికంగా దృష్టి కేంద్రీక‌రించింది. వీటితో పాటు ఇక మీదట ఏ వేడుకకైనా 50 మందికి మాత్రమే అనుమతి అని ఏపీ వైద్యశాఖ స్పష్టం చేసింది. 50 శాతం పరిమితితోనే ప్రజారవాణాకు అనుమతిస్తామని, సినిమా థియేటర్లలో 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతి అని తెలిపింది. చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులను కూడా అందుబాటులో ఉంచుతోంది. రెమిడెసివిర్‌ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. రెమిడెసివిర్‌ కొరత ఉంటే హెల్ఫ్‌లైన్‌ నంబర్లకు కాల్‌ చేయాలని సూచించింది.