Idream media
Idream media
శాంతసుందరి వెళ్లిపోయారు. ఎవరైనా వెళ్లిపోవాల్సిందే. కాకపోతే కొందరు పాదముద్రల్ని వదిలి వెళ్తారు.
2004లో నవ్య వీక్లీలో కథలు ఎంపిక చేసే పని నాది. ఒకసారి హిందీ అనువాద కథ వచ్చింది. మూలం బావుందా, అనువాదం బావుందా, నిజంగా అంత బావుంది. అనువాదం శాంతసుందరి. ఆమెకో కార్డు ముక్కతో తెలిపి అచ్చు వేశాను. తర్వాత ఇంకో రెండు కథలు.
ఆ తర్వాత నేను మా ఊరి మహావైద్యగాడు, ఆంధ్రా నెపోలియన్ అని రెండు పుస్తకాలు అచ్చు వేశాను. ఆవిష్కరణ సభలపై మమకారం లేకపోవడం, నిర్వహణకి తగినంత డబ్బు లేకపోవడంతో సభలు పెట్టలేదు. కానీ ప్రముఖ రచయిత సలీం ఒప్పుకోలేదు. ఆయనే అంతా నెత్తిన వేసుకుని సభ పెట్టించాడు. అది ఆయన సంస్కారం. ఆయనకి సరిగా కృతజ్ఞతలు కూడా చెప్పకపోవడం నా కుసంస్కారం.
సభకి చాలా మంది ప్రముఖులు వచ్చారు. శ్రీరమణ, అంపశయ్య నవీన్, శేఖర్రెడ్డి (ప్రస్తుత సమాచార శాఖ కమిషనర్) , రచయితలు ఖదీర్, గొరుసు, వసంత లక్ష్మి, అక్కయ్య, ఇంకా చాలా మంది. వీళ్లందరితో పాటు సభకు ఇద్దరు దంపతులు. ఆవిడ శాంతసుందరి, ఆయన గణేశ్వరరావు. వాళ్లని నేను పిలవలేదు. పేపర్లో వార్త చూసి వచ్చారు.
నాకు అప్పటి వరకూ ఆమె కొడవటిగంటి కూతురని తెలియదు. తెలిసే సరికి విపరీతమైన సంతోషం. జీవితాన్ని , సమాజాన్ని అర్థం చేసుకోడానికి (నిజంగా చేసుకున్నానా?) సాయపడిన వాళ్లలో ఆయన ముఖ్యులు. యూనివర్సిటీ లైబ్రరీలో ఆయన సాహిత్యం మొత్తం చదివాను.
తర్వాత అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాన్ని. నేను తిరుపతి సాక్షికి వెళ్లిపోతున్నానని తెలిసి ఒకసారి ఇంటికి రండి అని పిలిచారు. సారథి స్టూడియో వెనుక ఇల్లు. వాళ్ల ఆదరణ మరిచిపోలేనిది. శాంతసుందరి తన అనువాద పుస్తకాన్ని ఇచ్చారు. ఇద్దరికీ సాహిత్యమే లోకం.
తిరుపతిలో ఉన్నప్పుడు రచయిత్రుల వేదిక సమావేశానికి వచ్చారు. ఇంటికి రమ్మంటే ఇంకోసారి వస్తామన్నారు. రాలేదు, రారు కూడా.
ఆమె ఎంత గొప్ప అనువాదకురాలంటే , రావణుడు ఏకబిగిన చదివి రివ్యూ రాశాను. అనువాద నవలని అంత పొగడాలా అని అన్నారు. నేను పొగిడింది అనువాదకురాలిని అని చెప్పాను.
ఏడాది క్రితం శాంతసుందరి ఫోన్ చేసి నేను రాసిన ఏదో వ్యాసం బాగుందన్నారు. అమీర్పేటలో ఇల్లు ఖాళీ చేసి , ఊరికి దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో చేరామని చెప్పారు. ఒకసారి ఇంటికి రమ్మన్నారు. దుర్మార్గున్ని , వెళ్లలేదు. ఆమె తొందర పడి ఆ ఇల్లు కూడా ఖాళీ చేశారు. వెళితే ఆమె పాదాలకి ఒక దండం పెట్టుకునే అదృష్టం దక్కేది.
ఇదంతా ఆమె బతికి ఉండగా కదా రాయాలి? ఎందుకింత మొద్దుబారి పోతున్నామో తెలియదు. హైదరాబాద్లోనే ఉన్నా ఏళ్ల తరబడి కలుసుకోం. మాట్లాడుకోం.
ఈ మధ్య కరోనా వచ్చి ఐసోలేషన్లో ఉన్నా. అంతా నార్మల్గా అనిపించింది. ఎందుకంటే నేను ఐసోలేషన్లో చాలా ఏళ్లుగా ఉంటున్నా. నేనే కాదు, చాలా మంది ఇంతే. ఈ విషయం వాళ్లకి తెలీకపోవచ్చు.
ఈ 15 సంవత్సరాల్లో ఆమెని చూసింది ఐదారు సార్లే. కానీ జీవించి ఉన్నారంటే చూడకపోయినా అదో సంతోషం. ఇక చూడలేం అని తెలియడం మనసుని బాధించే విషాదం. ఆమె లేని గణేశ్వరరావు గారిని చూడడం కూడా కష్టమే. ఈ కష్టాన్ని ఆయన తట్టుకోవాలి.