iDreamPost
iDreamPost
ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అసంతృప్తితో ఉన్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వారం మొదట్లో విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఉద్యోగసంఘాల నేతలు మీడియా సమావేశం ప్రారంభానికి ముందే ఓ ఫోన్లో మాట్లాడడం రికార్డు అయింది. అయితే అవతల ఫోన్లో ఎవరున్నారో అనేది ఇదిమిద్దంగా తేలినప్పటికీ ప్రతిపక్షం, మీడియా ఓ స్థాయిలో ఫోన్లో మాట్లాడుతున్న ఉద్యోగసంఘాల నేతల వీడియో క్లిప్ ను వైరల్ చేసింది. ప్రభుత్వం నుండి ఓ పెద్దస్థాయి వ్యక్తి ఉద్యోగసంఘాలను బెదిరించారని కూడా ప్రతిపక్షం, మీడియా ఆరోపించి ఆ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో వైరల్ చేసింది.
అయితే వాటన్నిటికీ ప్రభుత్వం తరపున సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ రోజు జవాబుచెప్పారు. మొదట తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉద్యోగసంఘాల నేతలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి కే ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల నుండి ఎన్జీవో ల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు, జెఎసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు జి హృదయరాజు, వై వి రావు, కె వి శివారెడ్డి, జి వి నారాయణరెడ్డి పాల్గొన్నారు.
చర్చల అనంతరం సజ్జల రామకృష్ణా రెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే “ఇది ఉద్యోగస్తుల ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఉద్యోగస్తులంటే ప్రత్యేక అభిమానం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ఉద్యోగస్తులను స్నేహితులుగా చూసే ప్రభుత్వం ఇది” అంటూ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వానికి ఉన్న ఆర్ధిక ఇబ్బందులను కూడా ప్రస్తావిస్తూ, “కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది. ఆర్ధిక పరిస్థితి కాస్త దెబ్బతిన్నది. అందువల్లనే కొందరు ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో ఆలస్యం జరుగుతోంది” అని నిజాన్ని అంగీకరించి ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేశారు.
Also Read : CBN Power Cuts- మీ హయాంలో చీకటి రోజులు మరచిపోయారా బాబు !
అయితే ఈ సమస్యలు అన్నీ అధిగమిస్తామని, ప్రభుత్వంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకం అని, ప్రభుత్వ పధకాలు ప్రజలకు చేర్చడంలో ఉద్యోగులు చేస్తున్న కృషిని కూడా సజ్జల ప్రస్తావించి, ఉద్యోగస్తులను అభినందించారు. ఉద్యోగస్తుల్లో ఉన్న కాస్త అసంతృప్తిని ఆకాశమంత చేసి రాజకీయ లబ్ది పొందాలనుకున్న ప్రతిపక్షాలు, మీడియా కుట్రలకు సజ్జల తెరదించారు. చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిన చర్చలు ప్రతిపక్షాల ఆశలపై నీళ్ళు చల్లాయి.
ఇక ప్రభుత్వ తీరుపట్ల ఉద్యోగ సంఘాల నేతలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఓ పది అంశాలు ప్రస్తావిస్తూ మంగళవారం నాడు ప్రభుత్వానికి ఓ లేఖ రాశామని, దానికి ప్రభుత్వం 24 గంటలలోపే (బుధవారం నాడు) స్పందించడం సంతోషంగా ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.
ఏ ప్రభుత్వం అయినా లేదా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా అసంతృప్తి మొదలయ్యేది ఉద్యోగస్తుల నుండే. అయితే ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకూ ఉద్యోగస్తుల్లో అసంతృప్తి రేగలేదు. ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఉచిత నివాస సదుపాయం రద్దు చేసినా కూడా ఉద్యోగస్తులు అర్ధం చేసుకున్నారు తప్ప, ప్రభుత్వంపై ఆందోళనకు దిగలేదు. అయితే జీతాలు ఆలస్యం అవడం పట్ల వాళ్ళలో కొంత అసంతృప్తి రేగినమాట వాస్తవం. అయితే ప్రభుత్వం తక్షణమే మేల్కొని చర్చలు జరపడం, వారి సమస్యలు పరిష్కరించే దిశగా హామీ ఇవ్వడం, అందుకు ఉద్యోగసంఘాల నేతలు సమ్మతించడం ఓ శుభపరిణామమే. ఉద్యోగస్తుల సమస్యలపట్ల గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత వేగంగా స్పందించిన దాఖలాలు లేవు. వినతిపత్రం ఇచ్చిన 24 గంటలలోపే ప్రభుత్వం స్పందించడం పట్ల ఉద్యోగసంఘాల నేతలు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ సమస్యకు శుభం కార్డు పడినట్టే అనుకోవాల్సి ఉంటుంది.
Also Read : ABN Andhra Jyothi : బాబు – రాధాకృష్ణల కాంట్రాక్టు ప్రేమ