iDreamPost
iDreamPost
జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం..అంటూ మంగళవారం నాటి ఈనాడు పత్రిక తొలిపేజీలో కథనం ఇచ్చారు. ఏపీ హైకోర్టు సీజే సహా మరో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ కథనం రాయడంలో ఆశ్చర్యం లేదు. కానీ అదే ఈనాడు జస్టిస్ చంద్రు ఏం వ్యాఖ్యానించారో రాసి ఉంటే ఈ కథనానికి అర్థం ఉంటుంది. ఈనెల 10న విజయవాడలో జరిగిన మానవహక్కుల దినోత్సవ సభలో జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలను ఈనాడు ప్రస్తావించలేదు. ఆయన సభను కవర్ చేస్తూ అన్నింటినీ ప్రచురించిన ఈనాడు కేవలం ఏపీ హైకోర్టు తీరు మీద చేసిన వ్యాఖ్యలను మాత్రం విస్మరించింది. అది కూడా పెద్దగా ప్రాధాన్యత లేకుండా లోపలిపేజీలో ప్రచురించి చేతులు దులుపుకుంది. కానీ ఇప్పుడు అదే పత్రికలో ఆరోజు జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నట్టుగా మెయిన్ పేజీలో వార్త రాయడం గమనిస్తే రామోజీ నైజం మరోసారి బట్టబయలవుతుంది.
జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను పట్టించుకోదలచుకోకపోతే ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టిన కోర్టు వ్యాఖ్యలను కూడా పట్టించుకోకూడదు. పోనీ జస్టిస్ చంద్రు చేసినవి వివాదాస్పద వ్యాఖ్యలు కాబట్టి వదిలేశారు అనుకుంటే ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందనను మాత్రం ఎలా ప్రచురిస్తారు అంటే జస్టిస్ చంద్రు వివాదాస్పదంగా మాట్లాడినట్టు ఈనాడు భావిస్తే ఆ వివాదం గురించి పాఠకుడికి తెలియకుండా వాటిని ఖండించిన వాటిని మాత్రమే పాఠకులకు ప్రధాన పత్రిక తొలిపేజీలో అందించడం వెనుక కారాణాలను ఏ రకంగా సమర్థించుకుంటుందన్నది అనేది విస్మయకరం.
ఈనాడుది ప్రారంభం నుంచి ఇదే నైజం. జగన్ ప్రభుత్వ పథకాలను వివరించకుండా, ఆ పథకాల్లో లోపాలున్నాయంటూ విపక్ష టీడీపీ నేతల మాటలను హైలెట్ చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. కోర్టులో వివిద కేసుల విచారణ సందర్భంగా పిటీషన్ వేసిన వారి న్యాయవాదులు చేసిన వ్యాఖ్యలను కూడా కొన్ని సార్లు హైలెట్ చేస్తూ పాఠకుల్లో అలాంటి అభిప్రాయం కల్పించేందుకు యత్నించడం వారి సహజశైలి. తద్వారా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచవచ్చన్నది వారి కుయత్నం. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ పెద్దలంతా ఈనాడు ధోరణిని పలుమార్లు విమర్శించడానికి ప్రధాన కారణం కూడా ఇదే. అయినప్పటికీ చివరకు జస్టిస్ చంద్రు విషయంలో కూడా ఈనాడు అదే పంథాను కొనసాగించడం విచిత్రంగా కనిపిస్తోంది. పైగా అందరికీ పత్రికా విలువల గురించి బోధించే మీడియా సంస్థలోనే ఇలా జనాలను మభ్యపెట్టే ప్రయత్నం సాగడం వారి విలువల సారాంశాన్ని చాటిచెబుతుంది.
Also Read : సీఐడీ కేసు.. లక్ష్మీనారాయణకు ‘ముందస్తు’ రక్షణ