iDreamPost
iDreamPost
ఈ మధ్యకాలంలో ఏ సీనియర్ హీరోకు సాధ్యం కాని రీతిలో శరవేగంగా కేవలం నలభై అయిదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న దృశ్యం 2 మీద అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడు విడుదల చేస్తారా అనే ఆసక్తితో వెంకటేష్ అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. అయితే దీనికన్నా ముందు నారప్ప రావాల్సి ఉండటంతో ఫస్ట్ ఏది అనే విషయంలో సందిగ్దత నెలకొంది. నారప్ప పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా దృశ్యం 2 కి ఇతర యూనిట్ సభ్యులతో ఇంకొంచెం ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. రెండింటికి నిర్మాత సురేష్ బాబే కావడంతో ఆయన క్లారిటీగా చెప్తే తప్ప ఒక కంక్లూజన్ కు రాలేం. ఈలోపే ఒక షాకింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది.
దాని ప్రకారం దృశ్యం 2ని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న దిశగా సురేష్ బాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి గందరగోళంగా ఉంది. ఏప్రిల్, మేలో రావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా పడి ఏ డేట్లు ఫిక్స్ చేసుకుంటాయో అంతు చిక్కడం లేదు. యూత్, మాస్ సంగతి ఎలా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ మునుపటిలా హాల్ కు వచ్చేందుకు సిద్ధంగా లేరని కరోనా సెకండ్ వేవ్ ట్రెండ్ ని బట్టి అర్థమవుతోంది. మరోవైపు తెలంగాణ ఏపిలో సాయంత్రం లాక్ డౌన్ పెట్టే ఛాన్స్ ఉందని ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇన్ని రిస్కులు ఇప్పుడు రిలీజులతో ముడిపడి ఉన్నాయి.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే దృశ్యం 2 డిజిటల్ వైపు ఆప్షన్ గా పెట్టుకున్నట్టు తెలిసింది. మోహన్ లాల్ నటించిన ఒరిజినల్ వెర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో నేరుగా వచ్చింది. ఆకాశం నీ హద్దురా తర్వాత భారీ స్థాయిలో వ్యూస్ వచ్చిన సినిమాగా రికార్డు సృష్టించింది. కేరళలో ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాని కారణంగా ఇది మంచి డెసిషన్ అని తర్వాత అర్థమయ్యింది. సో వెంకీ అండ్ టీమ్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అన్నిరకాలుగా సిద్ధపడే షూటింగ్ ని చాలా ఫాస్ట్ గా పూర్తి చేసినట్టు చెబుతున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన దృశ్యం 2లో ఒకరిద్దరు తప్ప అందరూ ఫస్ట్ పార్ట్ క్యాస్టింగ్ నే కొనసాగించారు