iDreamPost
android-app
ios-app

Palavalasa Vikranth – పాలవలస విక్రాంత్ కు ఎమ్మెల్సీ యోగం?

  • Published Nov 09, 2021 | 10:45 AM Updated Updated Nov 09, 2021 | 10:45 AM
Palavalasa Vikranth – పాలవలస విక్రాంత్ కు ఎమ్మెల్సీ యోగం?

ఎన్నిక ఏదైనా ఆ కుటుంబ ప్రమేయం లేనిదే పూర్తి కాదు. కార్యక్రమం ఏదైనా వారి మార్గదర్శనంలో జరగాల్సిందే. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని పాలకొండ, రాజాం నియోజకవర్గాల్లో అంత ప్రాధాన్యం, ప్రజాదరణ ఉన్న పాలవలస కుటుంబం వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో కొనసాగుతూ కష్టకాలంలో అండగా నిలిచింది. తమకు పట్టున్న రెండు నియోజకవర్గాలతో పాటు జిల్లా స్థాయిలోనూ పార్టీని పటిష్ట పరచడంలో కీలక పాత్ర పోషించింది. అసెంబ్లీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు అన్నింటిలోనూ ముందుండి వైఎస్సార్సీపీ అభ్యర్థులను విజయాల బాటలో నడిపించింది. ఆ కుటుంబానికి చెందిన పాలవలస రాజశేఖరం గతంలో ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ ఛైర్మన్ వంటి కీలక పదవులు నిర్వహించారు. అయితే వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత రాజశేఖరం వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన విక్రాంత్ పార్టీ పరంగా పలు పదవులు నిర్వహించినా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశం మాత్రం రాలేదు. పదవులు లేకపోయినా.. పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న విక్రాంత్ కు సీఎం జగన్ న్యాయం చేయనున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవికి ఆయన్ను ఎంపిక చేస్తున్నట్లు రాజధాని వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

రెండు నియోజకవర్గాల్లో ప్రభావం

యువకుడైన విక్రాంత్ తండ్రి బాటలో రాజకీయాల్లో చేరి వైఎస్సార్సీపీలో ముఖ్య నేతగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాలేకపోయినా.. శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీ గెలిచిన మూడు స్థానాల్లో పాలకొండ, రాజాం నియోజకవర్గాలు పాలవలస కుటుంబ ప్రాబల్యం కారణంగానే ఆ పార్టీకి దక్కాయి. 2019 ఎన్నికల్లో ఆ రెండు స్థానాలను నిలబెట్టుకోవడంలోనూ వారిదే ముఖ్య భూమిక. ఈ ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు విక్రాంత్ కుటుంబం విశేష కృషి చేసింది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం మాత్రం విక్రాంత్ కు లభించలేదు. వారి కుటుంబ ప్రాబల్యం ఉన్న రెండింటిలో పాలకొండ ఎస్టీలకు, రాజాం ఎస్సీలకు కేటాయించడమే దానికి కారణం.

ఎమ్మెల్సీ రేసులో..

సామాజిక సమీకరణల వల్ల ఎమ్మెల్యే అయ్యే అవకాశం కోల్పోయిన విక్రాంత్ ను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 డిసెంబరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ గా ప్రభుత్వం నామినేట్ చేసింది. కొత్త పాలకవర్గాలు రావడంతో ఆ పదవి పోయింది. దాంతో సీఎం జగన్ ఆ కుటుంబానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 29న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విక్రాంత్ ను అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మూడు స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా వాటిలో ఒకదాన్ని బీసీ కోటాలో విక్రాంత్ కు ఖాయమని అంటున్నారు. అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తి అయ్యిందని, సీఎం జగన్ ఒడిశా పర్యటన నుంచి వచ్చిన తర్వాత ప్రకటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి పూర్తి సంఖ్య బలం ఉంది. దాంతో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఆ మూడు స్థానాల్లో ఆ పార్టీ విజయం తథ్యం. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థిగా విక్రాంత్ పేరు అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం.. ఆయన ఎన్నిక లాంఛనప్రాయం.

Also Read : Reddi Shanthi Patapatnam -రెడ్డి శాంతి ,తండ్రికి తగ్గ కూతురు