iDreamPost
android-app
ios-app

RK Death – ఆర్కే మృతి పై సందేహాలకు అదే ‘సమాధాన్’ !

  • Published Oct 16, 2021 | 6:06 AM Updated Updated Oct 16, 2021 | 6:06 AM
RK Death – ఆర్కే మృతి పై సందేహాలకు అదే ‘సమాధాన్’ !

సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతికి పోలీసులు అమలు చేసిన వ్యూహాలే కారణమని తెలుస్తోంది. ఆయనకు వైద్యం అందకుండా చక్రబంధంలో ఇరికించి పరోక్షంగా ఆయన మరణానికి కారకులయ్యారని విప్లవ పార్టీలతో సంబంధాలు ఉన్నవారి ద్వారా తెలుస్తోంది. 1995 నుంచి ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మకాం వేసి. ఏవోబీని మావోయిస్టు కోటగా మలచిన ఆర్కేను సజీవంగానో.. నిర్జీవంగానో పట్టుకునేందుకు ఏళ్లతరబడి ప్రయత్నించి భద్రతా బలగాలు విఫలమయ్యాయి. చివరికి అతని అనారోగ్యాన్ని ఆసరా చేసుకుని ఆపరేషన్ సమాధాన్ అనే వ్యూహంతో ఆర్కే మృత్యు ఒడికి చేరేలా చేయడంలో విజయం సాధించాయి.

ఏమిటీ ఆపరేషన్ సమాధాన్

ఏవోబీలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర బలగాలతో పాటు ఆంధ్ర, ఒడిశా,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రత్యేక సాయుధ బలగాలు కొన్నేళ్లుగా అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. పోలీస్ బలగాల కీలక టార్గెట్ ఆర్కే. పలుమార్లు ఆయన తృటిలో కూంబింగ్ దళాల నుంచి తప్పించుకున్నారు. ఎంత ప్రయత్నించినా ఆర్కే చిక్కకపోవడంతో పోలీస్ అధికారులు వ్యూహం మార్చారు. ఆపరేషన్ సమాధాన్ కు అమలు చేశారు. కోవిడ్ విజృంభించినప్పటి నుంచే దీన్ని అమలు చేయడం ప్రారంభించారు.

Also Read : Maoist RK Died : ఆర్కే నిజంగా చనిపోయాడా, ఎవరు దృవీకరించాలి?

గత కొంత కాలంగా ఆర్కే అనారోగ్యంతో బాధపడుతుండటం బాగా కలిసి వచ్చింది. కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇదే అదనుగా ఆర్కేకు సరైన వైద్యం అందకుండా బస్తర్, బీజాపూర్ అడవులను దిగ్బంధించారు. అటవీ మార్గాలన్నింటినీ మూసి వేశారు. బయటివారు లోపలికి.. లోపలివారు బయటకు రాకుండా చేయడమే ఆపరేషన్ సమాధాన్ లక్ష్యం. ఆర్కే పరిస్థితి బాగులేదన్న పక్కా సమాచారంతో అటవీ సరిహద్దులన్నింటినీ బలగాలతో నింపేశారు. ఫలితంగా వైద్యం అందక ఆర్కే తుది శ్వాస విడిచారని విప్లవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

పోలీసులకు ముందే సమాచారం

ఆర్కే పరిస్థితి విషమించడం నుంచి ఆయన మృతి చెందడం వరకు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు ముందుగానే సమాచారం అందింది. ఇన్ఫార్మర్ల ద్వారా దాన్ని ధృవీకరించుకుని మరణ వార్తను ప్రకటించారు. అయితే ఆపరేషన్ సమాధాన్ కారణంగా అటవీ ప్రాంతాల నుంచి సమాచారం అందే పరిస్థితి లేకపోవడంతో ఆర్కే సతీమణి శిరీషతో పాటు పలువురు విప్లవ సంఘాల నాయకులు తొలుత పోలీసుల ప్రకటనపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆర్కే మృతి వార్తపై సందేహాలు వ్యక్తమయ్యాయి. తర్వాత మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేయడంతో ఆర్కే మరణించారని ధృవపడటంతో పాటు, కూంబింగ్ దళాలతో అడవులను దిగ్బంధించడం వల్లే సరైన వైద్యం అందక ఆర్కే కన్నుమూశారని విప్లవ సంఘాలు ధృవపరచుకున్నాయి. ఆర్కే సతీమణి శిరీష కూడా ఇదే చెబుతూ దీన్ని పోలీసుల హత్యగా ఆరోపించడం గమనార్హం. మొత్తానికి పోలీసులకు ఎప్పటికీ దొరక్కుండా ఆర్కే అనంతలోకాలకు వెళ్లిపోయారు.

Also Read : RK Death – దివికేగిన ఆర్కే.. ధృవీకరించిన మావోయిస్టు పార్టీ