iDreamPost
iDreamPost
హోరాహోరీ పోరులో గత ఏడాది తృణమూల్ కాంగ్రెస్ను ఒంటి చేత్తో గెలిపించి.. ముచ్చటగా మూడోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మమతా బెనర్జీ సొంత పార్టీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఇంతకాలం తాను రాజకీయంగా పెంచి పోషించిన సొంత మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నుంచి ఆమెకు అసమ్మతి సెగ ఎదురవుతోంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీముతోనూ అభిషేక్ వర్గానికి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మమతా పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి అధ్యక్ష పదవి మినహా మొత్తం కార్యవర్గ పదవులన్నీ రద్దు చేశారు. దాని స్థానంలో జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు.
మంత్రి, మేయర్ ఒక్కరే..
అధికార టీఎంసీలో సీనియర్ నేతలు చాలామంది ఒకటికి మించి పదవుల్లో కొనసాగుతుండటం పార్టీలో చిచ్చు రేపింది. ఎక్కడా లేనివిధంగా మంత్రిగా ఉన్న ఫిర్హాద్ హకీమ్ రాష్ట్రంలో అతిపెద్దదైన కోల్కత్తా నగర పాలక సంస్థ మేయర్ పదవి కూడా నిర్వహిస్తున్నారు. మరికొందరు సీనియర్ ఎమ్మెల్యేలు ఒకటికంటే ఎక్కువ పదవులు నిర్వహిస్తున్నారు. ఈ అంశం పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య గ్యాప్ పెంచింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వర్గం ఒక వ్యక్తి-ఒక పదవి నినాదాన్ని తెరపైకి తెచ్చి కొన్ని రోజులుగా ప్రచారం చేస్తోంది. దీన్ని సీఎం మమతతో సహా సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయినా అభిషేక్ వర్గం సోషల్ మీడియా ద్వారా ఈ నినాదాన్ని హోరెత్తిస్తుండటంతో రెండు రోజులుగా పార్టీలో కాక రేగుతోంది.
అభిషేక్ సహా అందరి పదవులు రద్దు
ఒక వ్యక్తి-ఒక పదవి నినాదాన్ని ప్రచారం చేస్తున్న అభిషేక్ వర్గానికి మద్దతుగా రాష్ట్ర మంత్రి చంద్రమా భట్టాచార్య ట్వీట్ చేశారు. అయితే అరగంటలోనే దాన్ని తొలగించారు. పైగా ఆ ట్వీట్ ను తన పేరుతో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీం చేసిందని మంత్రి ఆరోపించారు. అయితే దీన్ని ఐ ప్యాక్ టీం ఖండించింది. దీంతో కొంతకాలం నుంచి ప్రశాంత్ కిషోర్, అభిషేక్ మధ్య కొనసాగుతున్న విభేదాలకు ఈ ట్వీట్ ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించిన అధ్యక్షురాలు మమతా, పార్టీలో అన్ని పదవులను రద్దు చేసి.. సీనియర్ నేతలతో జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అభిషేక్ ను అందరితోపాటు ఒక సభ్యుడిగా మార్చారు.