Idream media
Idream media
కరోనా వైరస్ సోకితే వెంటనే ఎవరికి ఫోన్ చేయాలి..? ఏమి చేయాలి..? అనే విషయం రాష్ట్రంలోని ప్రతి పౌరుడుకు తెలిసేలా అవగాహన కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ, ఒక వేళ వైరస్ సోకితే ఏమి చేయాలో కూడా ప్రజలకు తెలిసినప్పుడు ప్రాణాపాయం ఉండదన్నారు. అంతేకాకుండా వైరస్ వ్యాపించకుండా కుండా అరికట్టవచ్చని పేర్కొన్నారు. అందుకే జిల్లా కలెక్టర్లు ప్రజలకు అవగాహన కల్పించడంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. కరోనా సోకినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి..? పరీక్ష చేయించుకునేందుకు ఎక్కడికి వెళ్లాలి..? తదితర విషయాలపై ప్రజలకు విరివిగా అవగాహన కల్పించాలని సూచించారు.
వ్యాక్సిన్ వచ్చే వరకూ మనం కరోనా వైరస్తో కలసి జీవించాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం జగన్ పేర్కొన్నారు. మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి చిన్న చిన్న చర్యల ద్వారా వైరస్ సోకకుండా చూసుకోవచ్చన విషయం రాష్ట్రంలోని ప్రతి పౌరుడుకు తెలియజేయాలని కోరారు. వైరస్ సోకిన వారిలో 85 శాతం మందికి ఇంటిలోనే నయం అవుతోందని, వారికి వైద్యులు టెలిమెడిసన్ ద్వారా సేవలు అందిస్తున్నారని చెప్పారు. 15 శాతం మందికే ఆస్పత్రిలో చికిత్స అవసరం అవుతుందన్నారు. ఇళ్లలో ఉండేందుకు ప్రత్యేక సౌకర్యాలు లేని వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తోందన్నారు.
రాష్ట్రాల సరిహద్దులు తెరవడంతో రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలు పెరిగాయని, కాబట్టి వైరస్ వ్యాపించే అవకాశం ఉందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభం అయిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా అండాలని సీఎం జగన్ కలెక్టర్లకు సూచించారు.