iDreamPost
android-app
ios-app

డిజిటల్ హడావిడి సెకండ్ వేవ్

  • Published Apr 22, 2021 | 6:15 AM Updated Updated Apr 22, 2021 | 6:15 AM
డిజిటల్ హడావిడి సెకండ్ వేవ్

గత ఏడాది కోట్లాది జనాభా ఇళ్లకే పరిమితం కావడంతో లాక్ డౌన్ టైంని తమకు ఆదాయ వనరుగా మార్చుకున్న ఓటిటి సంస్థలకు మరోసారి అదృష్టలక్ష్మి తలుపు తట్టింది. ఒకపక్క దేశవ్యాప్తంగా లక్షలాది కేసులతో జనం కరోనా బారిన పడి నరకం చూస్తుండగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పరిణామాలు మరోసారి డిజిటల్ హడావిడికి తెర తీస్తున్నాయి. థియేటర్లు ఎక్కడిక్కడ అధిక శాతం మూతబడ్డాయి. తెరిచిన కొన్నింటిలోనూ కలెక్షన్లు అంతంత మాత్రమే. జనం హాల్ కు వచ్చే మూడ్ లో లేరని అర్థమవుతోంది. అందులోనూ తెలంగాణాలో రాత్రి కర్ఫ్యు వల్ల పబ్లిక్ సాయంత్రమే ఇళ్లకు చేరుకుంటూ ఉండటంతో నాలుగు గంటల షోలకు కూడా పెద్దగా స్పందన లేదు.

దీన్ని అవకాశంగా తీసుకుని ఓటిటి ప్రకటనలు క్యూ కడుతున్నాయి. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ నిన్న మిడ్ నైట్ నుంచే నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. ఈ రోజు రాత్రి నుంచి ‘చావు కబురు చల్లగా’ ఆహాలో అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ కానుండగా కార్తీ ‘సుల్తాన్’ని మే 2న ప్రీమియర్ చేయబోతున్నారు. సల్మాన్ ఖాన్ ‘రాధే’ ఒకేరోజు థియేటర్, జీ ఓటిటి ప్లాట్ ఫార్మ్స్, ఇతర డిటి హెచ్ సర్వీసులలో స్ట్రీమింగ్ కాబోతోంది. శివ కార్తికేయన్ ‘డాక్టర్’, ధనుష్ ‘జగమే తంత్రం’ డేట్లు కూడా ఇవాళ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. వకీల్ సాబ్ కు సంబంధించిన అప్ డేట్ కూడా ఇంకో రెండు మూడు రోజుల్లో వచ్చినా ఆశ్చర్యం లేదు.

ఇకపై ఈ ట్రెండ్ మరికొంత కాలం ఇలాగే కొనసాగనుంది. సల్మాన్ ఖాన్ అంతటి పెద్ద స్టార్ ఓటిటికి ఓటు వేయక తప్పలేదు కాబట్టి ఇక మీడియం రేంజ్ సినిమాలన్నీ క్యూ కడతాయి. తెలుగులోనూ ఈ తరహా పరిణామాలు చూడబోతున్నాం. ముందు థియేటర్లకే వస్తామని చెప్పిన బడ్జెట్ మూవీస్ ఇప్పుడు సదరు డిజిటల్ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నాయి. ఇంకో నెల దాకా సర్దుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆ తర్వాతైనా డేట్లు దొరికే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఇలా చేయక తప్పడం లేదు. కరోనా సెకండ్ వేవ్ తరహాలో ఇప్పుడు ఓటిటికు కూడా పాజిటివ్ సెకండ్ వేవ్ మొదలయ్యింది.