Idream media
Idream media
దేశరాజధాని ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరుకు నగరా మోగింది. 70 స్థానాలు గల ఢిల్లీ శాసన సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 21 వరకు నామినేషన్ దాఖలు ఆఖరు తేదీ కాగా మరుసటి రోజు అంటే 22వ తేదీన నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. 24వ తేదీన నామినేషన్లు పరిశీలించనున్నారు. వచ్చే నెల 8వ తేదీన 70 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత అంటే.. ఫిబ్రవరి 11వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాయకత్వంలో 2015లో బలమైన ప్రభుత్వం ఏర్పడింది. 70 స్థానాల్లో ఆప్ ఏకంగా 67 స్థానాలు గెలుచుకుంది. అంతకు ముందు ఏడాది క్రితం కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాభం చవి చూసింది. కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకుంది.
ఏడు నెలల క్రితం లోక్సభ ఎన్నికల్లో మళ్లీ అంతకు ముందు కన్నా ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ సారి ఎలాగైనా ఢిల్లీ శాసన సభలో జెండా పాతాలన్న లక్ష్యంతో ఉంది. కేజ్రీవాల్ నేతృత్వలోని ఆప్ మాత్రం అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని ఉవ్వీళ్లుతోంది. ఈ రెండు పార్టీల మధ్యలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవం సాధించుకునేందుకు పోరాడాలని భావిస్తోంది.