iDreamPost
iDreamPost
జంటిల్మెన్ గేమ్ కి నిజమైన జంటిల్మెన్ అని నిరూపించుకున్న అనిల్ కుంబ్లే అమరావతి వచ్చారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ తో భేటీ అయ్యారు. మార్యాదపూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చకు రావడం ఆసక్తికరం. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల అనిల్ కుంబ్లే ఆసక్తి ప్రదర్శించడమే కాకుండా సీఎం జగన్ ముందు అంతే ముఖ్యమైన ప్రతిపాదనలుంచడం చర్చనీయాంశం అవుతోంది.
ఏపీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రతిపాదనలో ఉంది. ఇప్పటికే సీఎం జగన్ దానికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చారు. అధికారులు సన్నాహాల్లో ఉన్నారు. అది కార్యరూపం దాలిస్తే ఆ యూనివర్సిటీకి తాను సేవలందిస్తానని అనిల్ కుంబ్లే వంటి స్టార్ ఇమేజ్ ఉన్న మాజీ క్రికెటర్ సిద్ధం కావడం ఆసక్తికరమే. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన యూనివర్సిటీ వీసీగా కరణం మల్లేశ్వరిని నియమించారు. ఇప్పటికే పెళ్లి తర్వాత హర్యానాలో స్థిరపడిన సంగతి అందరికీ తెలిసిందే.
ఏపీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తే తనవంతు సహాయం అందిస్తానని అనిల్ కుంబ్లే ముందుకు రావడమే కాకుండా మరిన్ని క్రీడా సంబంధిత అంశాలను వారిద్దరూ చర్చించారు. అదే సమయంలో క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీని పెట్టే అంశంపైనా దృష్టిసారించాలని అనిల్ కుంబ్లే ఏపీ సీఎంను కోరారు. ప్రస్తుతం జలంధర్, మీరట్ లాంటి నగరాలనుంచే అన్నిరకాల క్రీడా సామగ్రిని తెచ్చుకుంటున్నామని తెలిపారు. దాని మూలంగా రవాణా ఛార్జీలతో కలిపి అదనపు భారం కావడంతో ఎక్కువ మంది క్రీడల వైపు మొగ్గు చూపకపోవడానికి ఓ కారణంగా అంచనా వేశారు. ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా అందుబాటులో పరిశ్రమ పెడితే అందరికీ క్రీడా సామాగ్రి కొనుగోలుకి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి తన అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నానని కుంబ్లే చెప్పారు.
స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటుగా స్పోర్ట్స్ మెటిరీయాల్ తయారీ యూనిట్ వంటి అంశాలను అనిల్ కుంబ్లే ప్రతిపాదించడం , దానికి తానవంత కృషి చేస్తానని పేర్కొనడం ఏపీ క్రీడారంగానికి మేలు చేసే చర్యగా అంతా భావిస్తున్నారు. టీమిండియా కెప్టెన్, కోచ్ గానే కాకుండా బీసీసీఐతో పాటుగా ఐసీసీలో కూడా అనేక బాధ్యతలు నిర్వహించిన అనిల్ కుంబ్లే వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న స్పోర్ట్స్ పర్సనాలిటీ ఏపీ వైపు చూడడం అందరికీ స్ఫూర్తిదాయకం అవుతుందని చెబుతున్నారు.
Also Read : వైఎస్ని తిడుతున్నారంటూ జేసీ ఆవేదన..!