తాము అధికారంలోకి వస్తే పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని చెప్పినట్లుగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొత్త జిల్లాలకు తొలి అడుగు పడింది. కొత్త జిల్లాలకు కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. జిల్లాలకు సంబంధించిన అన్ని వివరాలను మెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఇక్కడే కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవేమిటంటే ప్రకాశం, బాపట్ల జిల్లాలకు కొత్త కలెక్టర్లు గా నియమితులైన దినేష్ కుమార్, విజయలు భార్యాభర్తలు కూడా కావడం విశేషం.
దినేష్ కుమార్ గుంటూరు జాయింట్ కలెక్టర్ గా, విజయ ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఎ కమిషనర్ గా ప్రస్తుతం పని చేస్తూ ఉన్న క్రమంలో ఉండగా వీరికి కలెక్టర్లుగా పదోన్నతులు లభించాయి. ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్, బాపట్ల జిల్లా నూతన ఎస్పీ వకుల్ జిందాల్ కూడా దంపతులు కావడం మరో విశేషం. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు జంటలను ఒక చోటకు చేర్చినట్లు అయింది.
నిజానికి ఇలా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వివాహం చేసుకోవడం అనేది ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. కోచింగ్ సమయంలో ప్రేమలోపడటమో లేక ఉద్యోగాలు వచ్చాక ట్రైనింగ్ సమయంలో ప్రేమలోపడటమో వారి మధ్య అధిక సంఖ్యలో జరుగుతూ ఉంటుంది. కానీ ఇలా భార్య భర్తలు దగ్గర్లో ఉండి డ్యూటీ చేసుకునే అవకాశం లభించడం మాత్రం కాస్త అరుదైన విషయం అనే చెప్పాలి. అలా రెండు జంటలను దగ్గరకు చేర్చిన ఘనత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కినట్లు అయింది.