iDreamPost
android-app
ios-app

ఉభయగోదావరుల్లోనూ కొనసాగుతున్న కరోనా ఉధృతి

  • Published Sep 22, 2020 | 1:07 PM Updated Updated Sep 22, 2020 | 1:07 PM
ఉభయగోదావరుల్లోనూ కొనసాగుతున్న కరోనా ఉధృతి

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లోనైనా, నవ్యాంద్రలోనైనా ఉభయ గోదావరి జిల్లాలుగా పిలవబడే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు అనేక ప్రత్యేకలతో అలరారేవి. రాష్ట్రానికి ధాన్యాగారంగానే కాకుండా, విస్తృతమైన జనసాంద్రత, పచ్చని ప్రకృతికి ఈ రెండు జిల్లాలు పెట్టింది పేరు. అయితే ప్రస్తుతం ఈ జిల్లాల్లో కరోళా తన ఉధృతిని కొనసాగిస్తోంది. దాదాపు నెల రోజులుగా ఈ రెండు జిల్లాల్లోనూ రోజుకు వెయ్యికి అటూ ఇటూగగా పాజిటివ్‌ కేసులు బైటపడుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

ప్రారంభంలో అంతంత మాత్రంగానే ఉన్న పాజిటివ్‌ల సంఖ్య రాన్రాను తీవ్రంగా మారింది. దీంతో ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ కేసులు నమోదువుతున్న జిల్లాల్లో ఈ రెండు జిల్లాలు ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు తూర్పుగోదావరిలో 87,769, పశ్చిమ గోదావరిజిల్లాలో 58వేల కేసులు వెలుగుచూసాయి. అత్యంత వేగంగా నలభైవేలకు పైగా కేసులు నమోదైన జిల్లాగా ప్రకాశం జిల్లా నిలుస్తుండగా, అత్యధిక కేసుల్లో ఉభయగోదావరి జిల్లాల తరువాత ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కొనసాగుతున్నాయి. ఇదే ఉధృతి కొనసాగితే ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనూ లక్ష కేసులు అతి త్వరలోనే చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఇప్పటి వరకు వైరస్‌ కారణంగా మొత్తం 489 మంది మృత్యువాత పడినట్టు బులిటెన్‌లు స్పష్టం చేస్తున్నాయి.

విస్తృతంగా టెస్టులు, ట్రీట్‌మెంట్‌ను ఈ రెండు జిల్లాల్లో ప్రభుత్వం చేపడుతోంది. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కేసుల సంఖ్యను నియంత్రించడంలో స్వీయ జాగ్రత్తలే ప్రధాన భూమిక పోషిస్తున్న నేపథ్యంలో ఈ రెండు జిల్లాల ప్రజలు తమ పరిధిలో జాగ్రత్తలు పాటించాలని అధికార వర్గాలు కోరుతున్నాయి.