iDreamPost
android-app
ios-app

కరోనా ఉగ్రరూపం-దేశంలో 11 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

కరోనా ఉగ్రరూపం-దేశంలో 11 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఒక్కరోజులో 40,243 పాజిటివ్ కేసులు – 675 మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొద్దిరోజుల నుండి 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో సుమారు 40 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 40,243 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 11,18,107 కి చేరింది.  అంతేకాకుండా మరణాల సంఖ్య 27,503 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.నిన్న ఒక్కరోజులో 675 మరణాలు సంభవించాయి.

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ మూడవ స్థానంలో కొనసాగుతోంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ బారినుండి 7,00,399 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 3,89,803 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో ఉగ్రరూపం దాల్చిన వైరస్

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి దడ పుట్టిస్తోంది.ఆదివారం కొత్తగా 9,518 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే ఒక రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవడం భారత్‌లో ఇదే తొలిసారి.కాగా మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,455 కి చేరుకుంది.అలాగే కరోనా మరణాలు కూడా గడిచిన 24 గంటలలో భారీగా నమోదయ్యాయి.ఇవాళ ఒక్కరోజే 258 కరోనా మరణాలు సంభవించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకి 11,854 మంది మృత్యువాత పడ్డారు.ఇక ఈరోజు 3,906 మంది కరోనా బాధితులు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో వైరస్ నుండి రికవరీ అయిన వారి సంఖ్య 1,69,569 కి చేరింది. ఇవాళ ముంబైలో కొత్తగా 1,038 మందికి వైరస్ సోకగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది.ఇక ఆదివారం ముంబైలో కరోనా కారణంగా 64 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 5,714 కి చేరింది.

తెలంగాణాలో 45 వేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో నిన్న కొత్తగా 1,296 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో తెలంగాణలో 45,076 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12,223 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 32,438 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 415 మంది మృత్యువాత పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న రికార్డు స్థాయిలో 5,041 కొత్త  కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికం.. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 49,650 మందికి కరోనా సోకగా 642 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ లో నమోదయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికం. నిన్న ఒక్కరోజే 56 మంది మృత్యువాత పడటం ఆందోళన కలిగించే విషయం. 22,890 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్  అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,118 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 14,644,360 మందికి కోవిడ్ 19 సోకగా 608,911 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 8,735,298 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 3,898,550 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 143,289 మంది మరణించారు.