ఒక్కరోజులో 49,310 పాజిటివ్ కేసులు – 740 మరణాలు
దేశంలో కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడటం లేదు. దేశంలో కొద్దిరోజులుగా ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తున్న కరోనాను అడ్డుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు విఫలయత్నంగానే మిగిలిపోయాయి. గత కొద్దిరోజుల నుండి 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 48,446 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 12,87,945 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 30,601 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజులో 740 మరణాలు సంభవించాయి…కానీ తొలిసారిగా 49 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్దారణ కావడం ఆందోళన కలిగించే విషయం.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ మూడవ స్థానంలో కొనసాగుతోంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ బారినుండి 8,17,593 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 4,39,475 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో ఉగ్రరూపం దాల్చిన వైరస్
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి దడ పుట్టిస్తోంది. గురువారం కొత్తగా 9,895 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,502 కి చేరుకుంది.అలాగే కరోనా మరణాలు కూడా గడిచిన 24 గంటలలో భారీగా నమోదయ్యాయి.ఇవాళ ఒక్కరోజే 298 కరోనా మరణాలు సంభవించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకి 12,854 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఈరోజు 6,484 మంది కరోనా బాధితులు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో వైరస్ నుండి రికవరీ అయిన వారి సంఖ్య 1,94,253 కి చేరింది. ఇవాళ ముంబైలో కొత్తగా 1,245 మందికి వైరస్ సోకగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,923 చేరింది.ఇక ఆదివారం ముంబైలో కరోనా కారణంగా 55 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 5,930 కి చేరింది.
ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో 8 వేల పాజిటివ్ కేసుల నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది.మహారాష్ట్ర తర్వాత అత్యధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో 7,988 కొత్త కేసులు నమోదయ్యాయి.. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 72,711 మందికి కరోనా సోకగా 884 మంది మృత్యువాత పడ్డారు. నిన్న ఒక్కరోజే 61 మంది మృత్యువాత పడటం ఆందోళన కలిగించే విషయం. 37,555 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 34,272 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణాలో 50 వేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో నిన్న కొత్తగా 1,567 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో తెలంగాణలో 50,826 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,052 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 39,327 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 447 మంది మృత్యువాత పడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా 15,651,911 మందికి కోవిడ్ 19 సోకగా 636,470 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 9,535,342 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 4,169,991 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 147,333 మంది మరణించారు.