iDreamPost
iDreamPost
అగ్రవర్ణ మహిళల ఆర్థిక సాధికారత, మెరుగైన జీవనోపాధి ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్ఛిన వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు అందజేస్తారు. రాష్ట్రంలోని 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసు ఉన్న అగ్రవర్ణ మహిళలు ఈ పథకానికి అర్హులు. మొత్తం 3,92,674 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.589 కోట్లు నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జమ చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం సొమ్ము వారి ఖాతాల్లో జమ చేస్తారు.
మహిళా సాధికారతలో మరో ముందడుగు..
ఇప్పటికే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ.. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం.. అక్కచెల్లెమ్మల పేరిట ఉచిత ఇళ్ల పట్టాలు, ఇళ్లు.. మొదలైన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారి కాళ్ల మీద వారిని నిలబెడుతూ చరిత్ర సృష్టించిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు మహిళా సంక్షేమంలో మరో అడుగు ముందుకు వేస్తోంది. మేనిఫెస్టోలో చెప్పకపోయినా రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజికవర్గాల్లోని పేద మహిళలకు కూడా మేలు చేయాలన్న సత్సంకల్పంతో రూపొందించిన కానుకే ఈ ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’.
అన్ని వేళలా అండగా..
అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకు అక్కచెల్లెమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. గర్భవతులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది. నాడు–నేడు ద్వారా కౌమార బాలికల ఆత్మగౌరవం నిలబెట్టేలా పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం, స్కూల్స్లో ఫర్నీచర్, తాగునీరు, ప్రహరీలు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు తదితర సదుపాయాలతో వాటి రూపురేఖలు మారుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం సైతం ప్రవేశపెట్టింది. స్వేచ్ఛ పథకం ద్వారా కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ను పంపిణీ చేస్తోంది.
మహిళల భద్రత కోసం అభయం, దిశ యాప్లు తీసుకొచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించింది. అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా వారి పేరు మీదే ఇళ్ల పట్టాలు మంజూరు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేస్తోంది. 1 నుంచి 12వ తరగతి వరకు పిల్లలను బడికి పంపే పేద తల్లులకు అమ్మఒడి ద్వారా ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తోంది. మాఫీ చేస్తానని చెప్పి గత ప్రభుత్వం ఎగ్గొట్టిన పొదుపు సంఘాల్లోని అక్కచెల్లెమ్మలను అప్పుల ఊబి నుంచి ఆదుకుంటోంది. ఇందులో భాగంగా.. దాదాపు రూ.25 వేల కోట్ల రుణ బకాయిలను వైఎస్ జగన్ ప్రభుత్వమే నాలుగేళ్లపాటు చెల్లించేందుకు సంకల్పించింది. వారి ఆర్థికాభివృద్ది, సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ ఆసరా.. వారి రుణాలపై వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలుచేస్తోంది.
45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లపాటు అందించడమే కాక, వారికి జీవనోపాధి అవకాశాలు కల్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా వైఎస్సార్ చేయూత ద్వారా తోడ్పాటు అందిస్తోంది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ కాపునేస్తం ద్వారా ఏటా రూ.15,000లు ఆర్థిక సాయం అందిస్తోంది. 60 ఏళ్లు పైబడిన అవ్వలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు వైఎస్సార్ పెన్షన్ కానుక ఇస్తోంది.
నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది. కేబినెట్లో మహిళలకు కీలకశాఖలు అప్పగించింది. ఒకరికి ఉప ముఖ్యమంత్రి, మరో మహిళకు హోంమంత్రిగా అవకాశం కల్పించింది. స్థానిక సంస్థల పదవుల్లో మహిళలకు ప్రాధాన్యతనిచ్చింది. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వారికి 61 శాతం పదవులు కట్టబెట్టింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ఆర్థిక సాయం తల్లుల ఖాతాల్లో జమచేయడం ద్వారా వారి బిడ్డల ఉజ్వల భవితకు జగన్ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. బెల్టుషాపుల రద్దు ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో సుఖశాంతులు తీసుకొచ్చింది. ఇక 60 ఏళ్లు పైబడ్డ మహిళలకూ వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా పెంచి ఇస్తున్న పెన్షన్తో నెలకు రూ. 2,500 చొప్పున ఏటా రూ.30వేల లబ్ధి ప్రభుత్వం చేకూరుస్తోంది. వీరితోపాటు వితంతువులు, ఒంటరి మహిళలూ లబ్ధి పొందుతున్నారు.